
-
రోహిత్ శరకు సెలెక్టర్ల షాక్.. వన్డే కెప్టెన్సీ గిల్కే
-
ఆస్ట్రేలియాతో వన్డే, టీ20 సిరీస్లకు జట్ల ఎంపిక
-
వన్డేల్లోజడేజాపై వేటు.. నితీశ్ రెడ్డికి చోటు
అహ్మదాబాద్: ఇండియా క్రికెట్లో అనూహ్య పరిణామం. 2027 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకుని సెలెక్టర్లు వన్డే కెప్టెన్సీలో మార్పులు చేశారు. ఇండియాకు చాంపియన్స్ ట్రోఫీ అందించిన హిట్మ్యాన్ రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి యంగ్ సెన్సేషన్ శుభ్మన్ గిల్కు జట్టు పగ్గాలు అప్పగించారు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ రోహిత్తో పాటు సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీని ఆస్ట్రేలియా టూర్కు సెలెక్ట్ చేసింది.
చాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఈ ఇద్దరు లెజెండ్స్ మళ్లీ వన్డేల్లో బరిలోకి దిగబోతున్నారు. ఈ నెల 19 నుంచి జరిగే ఈ టూర్లో మూడు వన్డేలతో పాటు ఐదు టీ20ల సిరీస్ల కోసం సెలెక్షన్ కమిటీ శనివారం వేర్వేరు జట్లను ఎంపిక చేసింది. వన్డే జట్టుకు శ్రేయస్ అయ్యర్ను వైస్- కెప్టెన్గా నియమించి ఆశ్చర్యపరిచింది. వర్క్లోడ్ దృష్ట్యా పేస్ లీడర్ జస్ప్రీత్ బుమ్రాకు వన్డే సిరీస్లో రెస్ట్ ఇచ్చింది. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డిని టీ20లతో పాటు తొలిసారి వన్డేలకు తీసుకున్న సెలెక్షన్ కమిటీ సీనియర్ ఆల్రౌండర్ జడేజాను తప్పించి షాకిచ్చింది.
మరోవైపు, టెస్టు ఫార్మాట్లో నిలకడగా రాణిస్తున్న లెఫ్టాండ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్కు వన్డే ఫార్మాట్లో మళ్లీ అవకాశం దక్కింది. టీ20 టీమ్లో మార్పులు లేవు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఆసియా కప్ నెగ్గిన జట్టును దాదాపుగా కొనసాగించింది. ఈ టూర్లో భాగంగా పెర్త్, అడిలైడ్, సిడ్నీలో ఈ నెల 19, 23, 25వ తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి. ఐదు టీ20ల సిరీస్లో తొలి రెండు మ్యాచ్లను ఈ నెల 29, 31వ తేదీల్లో కాన్బెరా, మెల్బోర్న్లో షెడ్యూల్ చేశారు. నవంబర్ 2, 6, 8వ తేదీల్లో హోబర్ట్, గోల్డ్ కోస్ట్, బ్రిస్బేన్లో చివరి మూడు టీ20లు జరుగుతాయి.
వన్డే జట్టు: గిల్ (కెప్టెన్), రోహిత్, కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), అక్షర్, రాహుల్ (కీపర్), నితీశ్ రెడ్డి, సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, సిరాజ్, అర్ష్దీప్, ప్రసిధ్, జురెల్ (కీపర్), జైస్వాల్.
టీ20 జట్టు: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్, గిల్ (వైస్ కెప్టెన్), తిలక్, నితీశ్ రెడ్డి, శివం దూబే, అక్షర్, జితేష్ (కీపర్), చక్రవర్తి, బుమ్రా, అర్ష్దీప్, కుల్దీప్, రాణా, శాంసన్ (కీపర్), రింకూ సింగ్, సుందర్.
2027 వరల్డ్ కప్ ప్లాన్లో రోకో లేనట్టేనా?
బీసీసీఐ పెద్దల సపోర్ట్తో హెడ్ కోచ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అగార్కర్ వన్డే కెప్టెన్సీ మార్చినట్టు తెలుస్తోంది. ఆస్ట్రేలియా మాదిరిగా జట్టు ప్రయోజనాలే పరమావధిగా తీసుకున్న ఈ నిర్ణయం వెనుక మూడు ప్రధాన అంశాలు కనిపిస్తున్నాయి. రోహిత్, కోహ్లీ (రోకో) ఇద్దరూ 2027 వరల్డ్ కప్ ప్లాన్స్లో లేకపోవడం.. కేవలం ఒకే ఒక ఫార్మాట్ను అప్పుడప్పుడు ఆడటం ద్వారా వీళ్లు ఫామ్, ఫిట్నెస్ను కొనసాగించడం సాధ్యం కాదనే భావనతో పాటు గిల్ను ఆల్ -ఫార్మాట్ కెప్టెన్గా సిద్ధం చేయడం గౌతీ, అగార్కర్ ఉద్దేశంగా కనిపిస్తోంది. ఈ నిర్ణయంతో రోహిత్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరినట్టే. రోహిత్కు కెప్టెన్సీ మార్పు గురించి ముందే తెలియజేశామని అగార్కర్ ధృవీకరించాడు. అయితే, రోహిత్ అంత ఈజీగా కెప్టెన్సీ వదులుకోలేదని అర్థం అవుతోంది.