
టెస్ట్ క్రికెట్కు ఇటీవలే గుడ్ బై చెప్పిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రాజకీయాల్లోకి రాబోతున్నాడన్న ప్రచారం జోరుగా నడుస్తోంది. ఈ ప్రచారానికి కారణం లేకపోలేదు. టెస్ట్ ఫార్మాట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన రోజుల వ్యవధిలోనే మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ను రోహిత్ శర్మ కలవడం చర్చనీయాంశమైంది. ఈ స్పెషల్ మీటింగ్ అటు రాజకీయ వర్గాల్లో, ఇటు క్రీడా వర్గాల్లో ఆసక్తి రేపింది. ఇద్దరి భేటీ గంటకు పైగా సాగింది.
It was great to welcome, meet and interact with Indian cricketer Rohit Sharma at my official residence Varsha. I extended my best wishes to him on his retirement from Test cricket and for continued success in the next chapter of his journey!@ImRo45#Maharashtra #Mumbai… pic.twitter.com/G0pdzj6gQy
— Devendra Fadnavis (@Dev_Fadnavis) May 13, 2025
ఈ క్రమంలోనే.. రాజకీయాల్లోకి రోహిత్ శర్మ వస్తున్నాడా.. అతని సెకండ్ ఇన్నింగ్స్ రాజకీయాలేనా.. బీజేపీ పార్టీలో చేరబోతున్నారా అనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మహారాష్ట్ర సీఎం అధికారిక నివాసం అయిన వర్షకు వచ్చి.. సీఎంతో భేటీ కావటం అనేది రాజకీయ వర్గాల్లోనే కాదు.. క్రికెట్ ప్రపంచంలోనూ హాట్ టాపిక్ అయ్యింది.
టెస్ట్ ఫార్మాట్కే కాదు రోహిత్ శర్మ టీ20లకు కూడా ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించేసిన సంగతి తెలిసిందే. టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాక విరాట్ కోహ్లీ సతీసమేతంగా ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ గోవింద్ శరణ్ జీ మహారాజ్ని కలిశాడు. వరాహ ఘాట్ సమీపంలో ఉన్న శ్రీ రాధా కేలి కుంజ్ ఆశ్రమంలో 3 గంటలకు పైగా గడిపారు. టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ తర్వాత కోహ్లీ ఇలా ఆధ్యాత్మిక చింతనలో ఉంటే.. రోహిత్ శర్మ సీఎంను కలవడం విశేషం. సీఎం పిలిస్తేనే రోహిత్ శర్మ ఆయన ఇంటికి వెళ్లారని తెలిసింది.
ఇదిలా ఉంటే.. క్రికెటర్లు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాకపోయినప్పటికీ రోహిత్ ఇప్పట్లో ఆ ఆలోచన చేయకపోవచ్చనే అభిప్రాయం అభిమానుల్లో వ్యక్తమవుతోంది. టీ20, టెస్ట్ ఫార్మాట్లకు గుడ్ బై చెప్పినప్పటికీ రోహిత్ శర్మ వన్డేల్లో ఇంకో రెండు, మూడేళ్లు కొనసాగొచ్చని అభిమానులు భావిస్తున్నారు. 2027 వన్డే వరల్డ్ కప్లో రోహిత్ శర్మ ఆడతాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. రోహిత్ శర్మ ఈలోపే వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటించి పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడేమోననే అనుమానాలు ఫడ్నవీస్ తో భేటీ తర్వాత బలపడుతున్నాయి.