
టీ20లకు ఆదరణ పెరగడంతో వన్డే క్రికెట్ భవిష్యత్ ప్రమాదంలో పడే అవకాశముందున్న వాదనపై రోహిత్ శర్మ స్పందించాడు. వన్డే క్రికెట్ కు ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేశాడు. వన్డేలతోనే తాను క్రికెటర్ గా ఎదిగానని..ఈ ఫార్మాట్ పనైపొందన్న వాదనలో అర్థం లేదని చెప్పుకొచ్చాడు. గతంలో టెస్టుల పనైపోయిందని కూడా చాలా మంది మాట్లాడారని గుర్తు చేశాడు. వన్డే క్రికెట్ పనైపోయింది...టీ20లు ముగిసిపోతాయి..టెస్టులకు కాలం చెల్లిందంటే తాను అస్సలు నమ్మనని పేర్కొన్నాడు. తన వరకు ఫార్మాట్ కాదని..క్రికెట్ ముఖ్యమని చెప్పుకొచ్చాడు. ఏ ఫార్మాట్ ఆడాలన్నది వ్యక్తుల ఇష్టమని తెలిపాడు.
అప్పటికీ..ఇప్పటికీ తేడా ఉంది..
గత టీ20 వరల్డ్ కప్ లో భారత్ పాక్ చేతిలో ఓడిపోయిందని రోహిత్ శర్మ అన్నాడు. అయితే అప్పటికి ఇప్పటికి జట్టులో చాలా మార్పులొచ్చాయని చెప్పాడు. ఆటతీరులోనూ మార్పులొచ్చాయని... దీని కారణంగా ఫలితం మారుతుందని అనుకుంటున్నామని రోహిత్ శర్మ ధీమా వ్యక్తం చేశాడు. ప్రస్తుతం మైదాన పరిస్థితులను అలవాటు చేసుకోవాల్సిన అవసరముందన్నారు. 40 డిగ్రీల ఉష్ణోగ్రతలో మ్యాచ్ ఆడాల్సి ఉంటుందని...అందుకు తగ్గట్టే సన్నదమవుతున్నట్లు పేర్కొన్నాడు.
బెంచ్ను పటిష్ఠం చేసే మార్గాలపై దృష్టి..
భారత జట్టుకు బలమైన రిజర్వ్ బెంచ్ను ఏర్పాటు చేసుకోవడం తమ ముఖ్య లక్ష్యమని రోహిత్ శర్మ అన్నాడు. బుమ్రా, షమీలాంటి సీనియర్ బౌలర్లు ఎప్పటికీ అందుబాటులో ఉండకపోవచ్చని..అందుకే రిజర్వ్ బెంచ్ను పటిష్ఠం చేసేందుకు ఉన్న మార్గాలపై జట్టు మేనేజ్మెంట్ దృష్టిపెట్టిందని వివరించాడు. బెంచ్ను ఎలా పటిష్ఠం చేయాలన్న దానిపై తాను కోచ్ రాహుల్ ద్రవిడ్ చర్చలు జరుపుతున్నట్లు చెప్పుకొచ్చాడు. ఎక్కువ మ్యాచ్లు ఉన్నప్పుడు.. ప్లేయర్ల గాయాలపాలైనప్పుడు బెంచ్ బలంగా ఉంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నాడు. అందుకే యువ ఆటగాళ్లకు ఎక్కువ ఛాన్సులు ఇస్తున్నామని చెప్పాడు. జింబాబ్వే సిరీస్లో చాలా మందికి అవకాశం దక్కిందని..ఈ అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకుంటారని రోహిత్ శర్మ విశ్వాసం వ్యక్తం చేశాడు.