
న్యూఢిల్లీ: ముంబై కెప్టెన్, టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ రోహిత్శర్మ ఫిట్నెస్పై బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ స్పందించాడు. రోహిత్ 70 శాతం ఫిట్నెస్తోనే ఉన్నాడని తెలిపాడు. పూర్తిగా రికవర్ అయితేనే ఆసీస్తో టెస్టుల్లో ఆడతాడని తేల్చిచెప్పాడు. ‘రోహిత్ 70 పర్సెంట్ ఫిట్నెస్తోనే ఉన్నాడు. అందువల్లే అతన్ని ఆసీస్ టూర్లో వన్డేలు, టీ20లకు సెలెక్ట్ చేయలేదు. టెస్ట్ జట్టులో మాత్రం చోటు ఇచ్చారు. మాకు, ఇండియా టీమ్ ఫిజియోకు, ఎన్సీఏ అధికారులకు తప్పా ప్లేయర్ల ఇంజ్యూరీ గురించి ఎవ్వరికీ పూర్తిగా తెలియదు. బీసీసీఐ పని చేసే విధానం జనానికి అర్ధం కావడం లేదనుకుంటా. వృద్ధిమాన్కు రెండు హ్యామ్స్ట్రింగ్ ఇంజ్యూరీలున్నాయి. ఈ విషయం సాహాతోపాటు మాకు, ఫిజియోకు మాత్రమే తెలుసు. ఈ విషయం అర్ధంచేసుకోని వారు ఏదేదో మాట్లాడుతున్నారు. చెత్త కామెంట్స్ చేస్తున్నారు. సాహా వైట్బాల్ ఫార్మాట్స్లో లేడు. కానీ, టెస్ట్ సిరీస్ కల్లా రికవర్ అవుతాడనే నమ్మకం ఉండడంతోనే ఆస్ట్రేలియా పంపాం. టీమిండియా ఫిజియో, ట్రెయినర్లు ఐపీఎల్ ఆసాంతం దుబాయ్లోనే ఉన్నారు. ఫిజియో నితిన్ పటేల్ గాయపడ్డవారితోపాటు ప్లేయర్లందరినీ పర్యవేక్షించారు’ అని దాదా తెలిపాడు. కాగా, ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో ఉన్న రోహిత్.. అక్కడ జరిగే ఫిట్నెస్ టెస్టులో పాసైతేనే ఆస్ట్రేలియా వెళ్లనున్నాడు.