హైదరాబాద్, వెలుగు: హరీశ్ రావు ఆరోగ్య శాఖ మంత్రి కావడమే రాష్ట్ర దౌర్భాగ్యమని కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. ఆయనకు ఉస్మానియా హాస్పిటల్ ఎందుకు కట్టా రో.. బస్తీ దవాఖాన్ల ఉద్దేశమేందో కూడా తెలియదని బుధవారం ఓ ప్రకటనలో ఎద్దేవా చేశారు. ఉస్మానియా ఆస్పత్రికి 12 లక్షల మంది పేషెంట్లు వస్తారని, బస్తీ దవాఖాన్లతో 7 లక్షల మంది పేషెంట్లు తగ్గారని హరీశ్ చెప్పడం విడ్డూరం అన్నారు. ఉస్మానియా ఆస్పత్రి టీచింగ్ ఆస్పత్రి అని పేర్కొన్నారు.
తాను మంత్రిగా ఉన్నప్పుడు జిల్లా కేంద్రాలలో ఏరియా ఆస్పత్రులు కట్టామని, ఇప్పుడు మెడికల్ కాలేజీలు కట్టామని చెప్తున్న సర్కారు అందులో టీచింగ్ స్టాఫ్ను ఎందుకు నియమించలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చీడలా పరిణమించిందని, ఈ సర్కారులో విద్య, వైద్యం నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆరోపించారు.