హాకీ ఆటగాళ్లకు బంఫర్ ఆఫర్ ప్రకటించిన ఒడిశా సీఎం

హాకీ ఆటగాళ్లకు బంఫర్ ఆఫర్ ప్రకటించిన ఒడిశా సీఎం

ఒడిశాలో పురుషుల హాకీ వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఓ అద్భుతమైన ఆఫర్ ప్రకటించారు. ఇండియా జ‌ట్టు హాకీ వ‌ర‌ల్డ్‌ క‌ప్ గెలిస్తే, ప్రతీ ఆటగాడికి రూ. కోటి బహుమతిగా ఇస్తామని హామీ ఇచ్చారు. రూర్కెలాలో పర్యటిస్తోన్న సీఎం పట్నాయక్.. బిర్సా ముండా హాకీ స్టేడియం కాంప్లెక్స్‌లోని ప్రపంచ కప్ విలేజ్ ను ప్రారంభించారు. ఈ సమయంలో అక్కడి వసతి పొందుతున్న జాతీయ పురుషుల హాకీ జ‌ట్టుతో ముఖ్యమంత్రి కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా టీమిండియాకు బెస్ట్ విషెస్ కూడా తెలిపారు. ఇండియా జ‌ట్టు ఛాంపియ‌న్‌గా నిలుస్తుందని ప‌ట్నాయ‌క్ ఆశాభావం వ్యక్తం చేశారు. 

నవీన్‌ పట్నాయిక్‌ రూర్కెలాలో ఆరంభించిన ఈ స్టేడియం 15 ఎకరాల్లో రూ.146 కోట్ల వ్యయంతో నిర్మించారు. గిరిజన ఉద్యమ నేత బ్రిసా ముండా పేరు పెట్టిన ఈ మైదానం దేశంలోనే పెద్ద హాకీ స్టేడియం. ఇందులో 21 వేల సీటింగ్‌ సామర్థ్యం ఉండగా.. క్రీడాకారుల విడిది కోసం 225 గదుల హోటల్‌ను కూడా అనుబంధంగా నిర్మించారు. స్టేడియాలకు వెళ్లడానికి ‘మై బస్‌’ పేరిట 30 వాహనాలను కూడా ఒడిషా ప్రభుత్వం ప్రారంభించింది.