పెన్షన్ ట్రస్ట్కు ఇచ్చేందుకు యాజమాన్యం సానుకూలం
డైరెక్టర్ (పర్సనల్, ఆపరేషన్స్, వెల్ఫేర్) ఎస్.చంద్రశేఖర్
గోదావరిఖని, వెలుగు: సింగరేణి సంస్థలో పనిచేసి పదవీ విరమణ పొందిన కార్మికులకు కోల్ ఇండియాలోలాగా పెన్షన్ పెరుగుదల కోసం ట్రస్ట్లో నిధిని జమ చేసేందుకు ప్రతి టన్ను బొగ్గుపై రూ.10 చెల్లించేందుకు యాజమాన్యం సానుకూలంగా ఉందని సంస్థ డైరెక్టర్ (పా(పర్సనల్, అడ్మినిస్ట్రేషన్, వెల్ఫేర్), ఆపరేషన్స్) ఎస్.చంద్రశేఖర్ చెప్పారు. డిసెంబర్ నెలాఖరులోగా జరగనున్న సింగరేణి బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటారన్నారు. గోదావరిఖని కమ్యూనిటీ హాల్లో రామగుండం, బెల్లంపల్లి , మందమర్రి, శ్రీరాంపూర్, భూపాలపల్లి ఏరియాలలో పనిచేసి రిటైరైన కార్మికుల పెన్షన్ సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఆర్జీ 1 జీఎం కె.నారాయణ అధ్యక్షతన ‘పెన్షన్ అదాలత్’ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ సింగరేణి రిటైర్డ్కార్మికులు చాలీచాలని పెన్షన్తో ఇబ్బంది పడుతున్నారని, వారికి నాయ్యం జరిగేలా సమస్యను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని అన్నారు. డైరెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ సింగరేణిలో పెన్షన్ సమస్యలు ఏర్పడకుండా ఏటీబీ సెల్స్ను బలోపేతం చేస్తామన్నారు. సీఎంపీఎఫ్ అడిషనల్ కమిషనర్ అగర్వాల్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న 400 పైగా వితంతు పెన్షన్ సమస్యలు పరిష్కరించామన్నారు. పెన్షన్కు సంబంధించిన సమస్యలు ఆన్లైన్ లేదా నేరుగా కలిసి తెలిపితే వారం రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. గోదావరిఖనిలో పెన్షన్ అదాలత్ నిర్వహించడం వల్ల దూరంగా ఉన్న భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల రిటైర్డ్ కార్మికులు ఇబ్బందులకు గురయ్యారు. మొత్తం వెయ్యి మంది హాజరు కాగా సుమారు 400 మంది దరఖాస్తులను అదాలత్లో అందజేశారు.