ధోలేరా స్మార్ట్‌‌‌‌ సిటీ పేరుతో.. 2,700 కోట్లకు మోసం

ధోలేరా స్మార్ట్‌‌‌‌ సిటీ పేరుతో.. 2,700 కోట్లకు మోసం
  • అనేక మంది ఏజెంట్ల ద్వారా వేల కోట్ల పెట్టుబడుల సేకరణ
  • వచ్చిన డబ్బుతో బంగ్లాలు, గనులు, హోటళ్లు కొనుగోలు
  • మిగిలిన క్యాష్‌‌‌‌ 27 నకిలీ కంపెనీలకు ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌ చేసుకుని పరార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌

జోధ్‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌: రాజస్థాన్‌‌‌‌కు చెందిన ఇద్దరు అన్నదమ్ములు సుభాష్‌‌‌‌ బిజారణియా, రణ్‌‌‌‌వీర్‌‌‌‌‌‌‌‌ బిజారణియా 70 వేల మందిని మోసం చేసి రూ.2676 కోట్లు కొల్లగొట్టారు. చైన్‌‌‌‌ బిజినెస్‌‌‌‌లో మోసపోయిన సికర్‌‌‌‌‌‌‌‌ జిల్లాకు చెందిన ఈ ఇద్దరు అదేరీతిలో ధోలేరా స్మార్ట్‌‌‌‌ సిటీలో భూముల పేరిట జనాలను మాయ చేశారు. 

రాజస్థాన్‌‌‌‌, ఢిల్లీ, గుజరాత్‌‌‌‌ రాష్ట్రాల్లో అనేక మంది ఏజెంట్లను పెట్టుకుని 70 వేల మంది నుంచి డబ్బులు గుంజారు. ఆ క్యాష్‌‌‌‌తో గ్రానైట్‌‌‌‌ గనులు, హోటళ్లు, లగ్జరీ కార్లు, ఫ్లాట్లు, బంగ్లాలు, రిసార్టులు కొనుగోలు చేశారు. 2021లో స్కామ్‌‌‌‌ మొదలుపెట్టి 2023 నుంచి కనిపించకుండాపోయారు.

ఏజెంట్లకు ఇచ్చిన కమీషన్లు 1,500 కోట్లు..

అహ్మదాబాద్‌‌‌‌లో 2021 ఏప్రిల్‌‌‌‌ 17న నెక్సా ఎవర్‌‌‌‌‌‌‌‌గ్రీన్‌‌‌‌ అనే రియల్‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌ కంపెనీ పెట్టారు. గుజరాత్‌‌‌‌లోని ధోలేరా స్మార్ట్‌‌‌‌ సిటీలో అగ్గువకే భూములిస్తామని నమ్మబలికారు. రూ.లక్షకు కొన్న ఎకరం జాగను రూ.16 లక్షలకు అమ్మారు. కంపెనీలో వేలాదిమంది ఏజెంట్లను పెట్టుకుని కమీషన్ల దందా నడిపించారు. పెట్టుబడి స్కీమ్‌‌‌‌లని చెప్పి జనాలను మభ్యపెట్టారు. ఫేక్‌‌‌‌ రిజస్ట్రేషన్‌‌‌‌ పత్రాలు చూపించి దేశవ్యాప్తంగా ప్రజల నుంచి 2,676 కోట్ల పెట్టుబడులు సేకరించారు. 

ఈ డబ్బుతో ధోలేరా స్మార్ట్‌‌‌‌ సిటీ పరిసరాల్లో 806 ఎకరాల భూములు కొన్నారు. రాజస్థాన్‌‌‌‌లో లగ్జరీ కార్లు, అపార్ట్‌‌‌‌మెంట్లు, బంగ్లాలు, ఆస్తులు కొనుగోలు చేశారు. జైపూర్‌‌‌‌‌‌‌‌లో హోటల్స్‌‌‌‌, రాజసమంద్‌‌‌‌లో గ్రానైట్..మార్బుల్‌‌‌‌ మైన్స్‌‌‌‌, గోవాలో 25 కోట్ల విలువైన రిసార్ట్‌‌‌‌ కొన్నారు. 250 కోట్ల నగదు నకిలీ కంపెనీల పేరుతో బ్యాంకు ఖాతాలు పుట్టించి ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌ చేసుకున్నారు. తమ పేరుమీద 15 కోట్లు ఫిక్స్‌‌‌‌ చేస్కున్నరు. అంతకుముందే కమీషన్ల కింద ఏజెంట్లకు 1,500 కోట్ల నగదు పంపిణీ చేశారు. 

మోసం జరిగినట్లు 2023లో ఆరోపణలు రావడంతో అన్ని రాష్ట్రాల్లోని తమ ఆఫీస్‌‌‌‌లను మూసేసి ఇద్దరు అన్నదమ్ములు పత్తా లేకుండా పోయారు. రాజస్థాన్‌‌‌‌లోని జోధ్‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్‌‌‌‌ రాష్ట్రాల్లోని 25 ప్రాంతాల్లో ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ డైరెక్టరేట్‌‌‌‌ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.