ఆన్లైన్ బెట్టింగ్ పేరుతో ..రూ.75 లక్షలు ముంచిన సైబర్ చీటర్స్

ఆన్లైన్ బెట్టింగ్ పేరుతో ..రూ.75 లక్షలు ముంచిన సైబర్ చీటర్స్

బషీర్‌‌బాగ్, వెలుగు: ఆన్​లైన్ బెట్టింగ్ పేరుతో సైబర్​ చీటర్లు వ్యక్తులు ఓ యువకుడిని నిండా ముంచారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి వివరాల ప్రకారం... సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన 32 ఏండ్ల యువకుడికి 2021లో ఒక బెట్టింగ్ ప్లాట్​ఫామ్ నుంచి మెసేజ్ వచ్చింది. క్రికెట్, తీన్​పత్తి, క్యాసినో వంటి ఆన్​లైన్ బెట్టింగ్ గేమ్స్‌‌లో పెట్టుబడి పెట్టాలని ఆ అందులో సూచించారు. 

వారి మాటలు నమ్మిన బాధితుడు మొదట రూ.10 వేలు డిపాజిట్ చేయగా, స్వల్ప లాభం వచ్చింది. నమ్మకం పెరిగి పలు దఫాలుగా రూ.10 లక్షల వరకు డిపాజిట్ చేయగా, ఆ డబ్బులు పోయాయి. బెట్టింగ్​మానేసిన అతడిని 2022 మార్చిలో మరోసారి సైబర్​ నేరగాళ్లు సంప్రదించారు. 

తక్కువ డిపాజిట్​తో మరో బెట్టింగ్ ప్లాట్‌‌ఫామ్​లో ఇన్వెస్ట్​ చేయాలని ఒప్పించారు. వారి మాటలు నమ్మి 2021 నుంచి 2025 వరకు పలు బెట్టింగ్ వెబ్​సైట్లలో మొత్తం రూ.75 లక్షలు వరకు కోల్పోయాడు. దీంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.