ఏపీకే ఫైల్ పంపి రూ.కోటి స్వాహా ..గంటలోనే సైబర్ నేరస్తుడి అరెస్ట్.. అమౌంట్ రికవరీ

ఏపీకే ఫైల్ పంపి రూ.కోటి స్వాహా ..గంటలోనే సైబర్ నేరస్తుడి అరెస్ట్.. అమౌంట్ రికవరీ

గచ్చిబౌలి, వెలుగు: చీరల రిటైల్  సంస్థలో పని చేసే అకౌంటెంట్​ ఫోన్​కు సైబర్​ నేరగాళ్లు ఏపీకే ఫైల్​ పంపించి ఫోన్​ను హ్యాక్​ చేసి ఓనర్​తో జరిగిన సంభాషణ అంతా విన్నారు. ఆ తరువాత ఓనర్​ పేరుతో నకిలీ వాట్సాప్​ ప్రొఫైల్​ సృష్టించి యజమానిలా మెసేజ్​ చేసి రూ.కోటి కొట్టేశారు. గంటలోపే ఫిర్యాదు అందుకున్న సైబరాబాద్​ సైబర్​ క్రైమ్​ పోలీసులు వెంటనే అకౌంట్ ను ఫ్రీజ్​ చేసి యూపీలోని లక్నోకు చెందిన దీపక్​ను అరెస్ట్​ చేసి డబ్బులు రికవరీ చేశారు. 

గచ్చిబౌలిలోని సైబరాబాద్​ కమిషనరేట్ లో సీపీ  రమేశ్,​ సైబర్​ క్రైమ్​ డీసీపీ పుష్ప వివరాలు వెల్లడించారు. సైబరాబాద్​లోని ఓ చీరల కంపెనీ అకౌంటెంట్​ ఫోన్​కు సైబర్​ నేరగాళ్లు ఏపీకే  ఫైల్​ పంపించారు. ఫోన్  యాక్సెస్​​కావడంతో అకౌంటెంట్, ఓనర్​ మధ్య జరిగిన ఫోన్​ సంభాషణ, చాటింగ్​ను తెలుసుకున్నారు. ఆ తర్వాత ఓనర్​ పేరుతో నకిలీ ప్రొఫైల్​ క్రియేట్​ చేసి ఓనర్​ మాదిరిగానే అకౌంటెంట్​తో చాటింగ్​ చేశారు. ఈక్రమంలో గత నెల 14న ఓనర్​ నుంచి అకౌంటెంట్​కు రూ.కోటి పంపించాలని మెసేజ్​ వచ్చింది.

 ఓనర్​ మెసేజ్​ చేశాడని నమ్మిన అకౌంటెంట్​ రూ.కోటి ట్రాన్స్​ఫర్​ చేశాడు. అయితే తన ప్రమేయం లేకుండా అకౌంట్​ నుంచి డబ్బులు కట్  కావడంతో ఓనర్​ అప్రమత్తమై అకౌంటెంట్​కు ఫోన్​ చేసి అడగడంతో విషయం బయటపడింది. దీంతో బాధితుడు గంటలోపే సైబరాబాద్​ సైబర్​ క్రైమ్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంటనే సదరు బ్యాంక్​ అకౌంట్​ను ఫ్రీజ్​ చేశారు. 

కేసు దర్యాప్తులో యూపీలోని లక్నోకు చెందిన దీపక్​కుమార్​ అకౌంట్​కు డబ్బులు ట్రాన్స్​ఫర్​ అయినట్లు గుర్తించి, నిందితుడిని ఈ నెల ఈ నెల 8న అరెస్ట్​ చేశారు. అక్కడి కోర్టులో హాజరుపర్చి ట్రాన్సిట్​ వారెంట్​పై సైబరాబాద్​కు తీసుకువచ్చి రిమాండ్​కు పంపించారు. బుధవారం బాధితుడికి రూ.కోటి చెక్​ను సీపీ అందజేశారు. ఏసీపీ రవీందర్​రెడ్డి, ఇన్​స్పెక్టర్​ మన్మోహన్, ఎస్సై శ్రీనివాసులు పాల్గొన్నారు.