సిట్టింగ్ సీటునూ స్లీపర్గా మార్చేశారు..బయటపడుతున్న ప్రైవేట్ బస్సుల డొల్లతనం

సిట్టింగ్ సీటునూ స్లీపర్గా మార్చేశారు..బయటపడుతున్న ప్రైవేట్ బస్సుల డొల్లతనం
  • గ్రేటర్​లో నాలుగో రోజూ ఆర్టీఏ తనిఖీలు
  • 49 కేసులు నమోదు, రూ. 1.49 లక్షల జరిమానా

హైదరాబాద్​సిటీ, వెలుగు:ప్రైవేట్​బస్సుల ఆపరేటర్లు ప్రయాణీకుల నుంచి ఏ స్థాయిలో దోపిడీ చేస్తున్నారన్న విషయం ఆర్టీఏ తనిఖీల్లో బయటపడుతూనే ఉన్నది. ప్రయాణీకులు కూర్చుని ప్రయాణించే సీటును కూడా స్లీప్​ సీటుగా మార్చిన వైనాన్ని చూసి అధికారులు అవాక్కయ్యారు. నాలుగో రోజైన మంగళవారం నాగోల్​ వద్ద జరిగిన తనిఖీలో 5 బస్సులు ఇలా సీట్టింగ్​సీటును స్లీపర్​సీటుగా కన్వర్ట్​చేసినట్టు అధికారులు గుర్తించారు. 

వీరిపై అధికారులు కేసులు నమోదు చేసి, రూ.15 వేల జరిమానా విధించారు. అలాగే హైదరాబాద్​సెంట్రల్​జోన్​పరిధిలో ఫైర్​సేఫ్టీలేని, ఫస్ట్​ఎయిడ్​బాక్స్​లేని 4 బస్సులపై కేసు నమోదు చేసి రూ. 17 వేల జరిమానా విధించారు. ఈస్ట్​జోన్​పరిధిలో 3 బస్సులకు ఫైర్​సేఫ్టీ లేకపోవడంతో పాటు కమర్షియల్​గూడ్స్​ను తరలిస్తున్నట్టు గుర్తించి కేసులతోపాటు రూ.13 వేల జరిమానా విధించారు. 

వెస్ట్​జోన్​పరిధిలో 7 బస్సులు టాక్స్​చెల్లించక పోవడం, ఫిట్​నెస్​లేని 7 బస్సులపై కేసు నమోదు చేసి రూ.17 వేల జరిమానా విధించారు. నార్త్​జోన్​లో 7 బస్సుల నిర్వాహకులు అనధికారికంగా బస్సును ఆల్ట్రేషన్​ చేయడంతో పాటు, ఫైర్​సేఫ్టీ లేకపోవడం, కమర్షియల్ గూడ్స్​ తరలించడం, ప్యాసింజర్స్​లిస్ట్​లేని కారణంగా కేసులు నమోదు చేసిన అధికారులు.. వీరి నుంచి రూ.12 వేల జరిమానా వసూలు చేశారు. 

అలాగే సౌత్​జోన్​ పరిధిలో ఫైర్​సేఫ్టీ లేక పోవడం, కమర్షియల్​ గూడ్స్​ తరలిస్తున్న 10 బస్సులపై కేసు నమోదుతోపాటు రూ. 25 వేల జరిమానా విధించారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో ప్యాసింజర్స్​లిస్ట్​ లేని, కమర్షియల్ గూడ్స్​ తరలిస్తున్న 6 బస్సులపై కేసు నమోదు చేసి 15వేల జరిమానా విధించారు. మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా పరిధిలో బస్సులో సెకండ్​డ్రైవర్​లేక పోవడం, లైసెన్స్​లేని, కమర్షియల్ గూడ్స్​ తరలిస్తున్న 7 బస్సుల పై కేసు నమోదు చేశారు. 

గత నాలుగు రోజులుగా చేపట్టిన తనిఖీల్లో మొత్తం 192 కేసులు నమోదు చేసి రూ.4.55 లక్షల జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 8 బస్సులను సీజ్​ చేశామన్నారు.