ఏపీలోని కర్నూలులో జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంతో తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతోన్న ట్రావెల్స్ పై ఆర్టీఏ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. తనిఖీలు చేస్తూ ఎక్కడిక్కడ సీజ్ చేస్తూ ఫైన్ వేస్తున్నారు. గత మూడు రోజుల్లో తెలంగాణలో ఆర్టీఏ అధికారులు 143 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను సీజ్ చేశారు. అక్టోబర్ 27న ఒక్కరోజే 54 బస్సులను సీజ్ చేశారు అధికారులు.
హైదరాబాద్ నుంచి పలు ప్రాంతాలకు వెళ్తూ రాకపోకలు సాగిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ పై ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల పరిధిలో ఆర్టీఏ అధికారుల తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఆర్టీఏ రూల్స్ కు విరుద్ధంగా నడుస్తున్న బస్సుల్లో తనిఖీలు చేసి సీజ్ చేస్తున్నారు. చాలా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయి. రోడ్ టాక్స్ , ఫైర్ సేఫ్టీ , ఇన్సూరెన్స్ , వెహికల్ ఫిట్నెస్, స్పీడ్ లిమిట్ , సిటింగ్ కెపాసిటీ, సీటింగ్స్ పేరుతో స్లీపర్ గా నడుపుతూ అనుమతులు లేని వస్తువులను గూడ్స్ క్యారీ చేస్తున్న బస్సులపై తనిఖీలు చేసి ఫైన్ లు వేశారు అధికారులు. అక్టోబర్ ,25,26.27న మూడు రోజుల్లో మొత్తం 143 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను సీజ్ చేసి మూడు లక్షల ఆరు వేలు ఫైన్ వసూలు చేశారు.
ఇటీవల వేమూరి కావేరి ట్రావెల్స్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఏపీలోని కర్నూలులో ప్రమాదానికి గురై 20 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆర్టీఏ అధికారులు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ట్రావెల్స్ పై సోదాలు చేస్తున్నారు.అనుమతుల్లేకుండా ఇష్టారాజ్యంగా నడుస్తోన్న ట్రావెల్స్ ను సీజ్ చేస్తున్నారు.
