
బస్టాండ్ లో కూర్చొన్న ప్రయాణికుడిపై ఆర్టీసీ బస్సు దూసుకెళ్లడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాచారెడ్డి మండలం ఫరీద్ పేట్ కు చెందిన లక్ష్మణ్.. హైదరాబాద్ కు వెళ్లేందుకు కామారెడ్డి బస్టాండ్ లో కూర్చొని ఎదురు చూస్తున్నాడు. అయితే అదే సమయంలో హైదరాబాద్ కే వెళ్లాల్సిన కామారెడ్డి డిపోకి చెందిన బస్సు వేగంగా ప్లాట్ఫాంపైకి దూసుకెళ్లి కుర్చీలో ఉన్న లక్ష్మణ్ను బలంగా ఢీకొంది.
దీంతో లక్ష్మణ్ కూర్చున్న కుర్చీలోనే ప్రాణాలు విడిచాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న లక్ష్మణ్ కుటుంబ సభ్యులు అతని ఆకస్మిక మరణంతో బోరున విలపించారు. ఈ ఘటనకు కారణమైన బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు వారు చెప్పారు.