![ఎన్నికల కోసమే ఆర్టీసీ విలీన ప్రకటన: రాములు నాయక్](https://static.v6velugu.com/uploads/2023/08/RTC-Merger-Announcement-Only-For-Elections-Ramulu-Naik_C6d9F24UbV.jpg)
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీపై కేసీఆర్ది కపట ప్రేమ అని, ఎన్నికల కోసమే విలీన ప్రకటన చేశారని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆరోపించారు. ఇది ఆర్టీసీ కార్మికులను మరోసారి మోసం చేసే ప్రయత్నమని పేర్కొన్నారు. కార్మికులు ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారన్న ఉద్దేశంతోనే కేసీఆర్ హడావుడి ప్రకటన చేశారని అన్నారు.
బుధవారం ఆయన గాంధీభవన్లో పీసీసీ అధికార ప్రతినిధి సామా రామ్మోహన్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. గతంలో ఆర్టీసీ విలీనం అసలు సాధ్యమే కాదని సీఎం కేసీఆర్అన్నారని, ఇప్పుడు కేవలం ఎన్నికల కోసమే యూటర్న్ తీసుకున్నారని మండిపడ్డారు. ‘ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసినప్పుడే ఈ నిర్ణయం తీసుకుని ఉంటే 38 మంది చనిపోయి ఉండేవారా..’ అని ప్రశ్నించారు.
ఆర్టీసీ బకాయిలపై కేసీఆర్ సమాధానమే చెప్పలేదని విమర్శించారు. సంస్థ విలీన ప్రకటన వెనుక ఆస్తులను అమ్మేసే కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కాంగ్రెస్ పార్టీ 2018 ఎన్నికల మేనిఫెస్టోలోనే పెట్టిందని గుర్తు చేశారు. కేసీఆర్ కుట్రలకు బలికావొద్దని ఆర్టీసీ కార్మికులకు ఆయన సూచించారు.