ఆర్టీసీ బస్సులకూ జీపీఎస్​

ఆర్టీసీ బస్సులకూ జీపీఎస్​
  • ఏర్పాటు చేస్తున్న సేఫ్​ అనే స్వచ్ఛంద సంస్థ..
  • ఆర్టీసీకి పైసా ఖర్చు లేకుండా సేవలు
  •  ప్రయాణికులకు తప్పనున్న వెయిటింగ్​ తిప్పలు
  • రెండు మూడు నెలల్లో పూర్తిగా అందుబాటులోకి

హైదరాబాద్​, వెలుగు:

ఎక్కాల్సిన బస్సు కోసం ఒక్కోసారి గంటల తరబడి వెయిట్​ చేసి చేసి విసుగుపుడుతుంది. ఎప్పుడొస్తుంది రా బాబూ.. అని చిరాకుపడుతుంది. ఆ చీకూచింతా లేకుండా ఎక్కాల్సిన బస్సు ఎక్కడుందో, ఎప్పుడొస్తుందో తెలిస్తే ఎలా ఉంటుంది? మస్తుంటది కదా. కొద్ది రోజుల్లోనే ఆ సౌకర్యం అందుబాటులోకి రాబోతోంది. రాష్ట్రంలోని అన్ని బస్సుల్లో గ్లోబల్​ పొజిషన్​ సిస్టం (జీపీఎస్​)ను పెట్టేందుకు ఆర్టీసీ అధికారులు కసరత్తులు చేస్తున్నారు. నిజానికి ఎప్పుడో ఆ ప్రాసెస్​ను స్టార్ట్​ చేసినా, ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఆలస్యమైంది. ఇప్పుడు మళ్లీ ఆ పనులు జోరందుకున్నాయి. రెండు మూడు నెలల్లో అన్ని బస్సుల్లోనూ అది అందుబాటులోకి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సేఫ్​ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి వీటిని ఏర్పాటు చేయిస్తోంది ఆర్టీసీ. ఇప్పటికే దాదాపు 400 హై ఎండ్​ బస్సులకు జీపీఎస్​ను పెట్టారు. ఇప్పుడు అన్ని బస్సుల్లోనూ ఏర్పాటు చేయనుంది. ఆర్టీసీకి ఒక్క పైసా ఖర్చు కూడా లేదు. మొత్తం సేఫ్​ సంస్థే చూసుకుంటుంది. జీపీఎస్​ను పెట్టాక కంట్రోల్​ రూమ్​కు అనుసంధానం చేయనున్నారు. యాప్​ను అందుబాటులోకి తేనున్నారు. మనం ఉండే ప్లేస్​కు దగ్గర్లోని బస్టాండ్​, స్టార్టింగ్​, ఎండింగ్​ ప్లేస్​లను టైప్​ చేస్తే ఎన్ని బస్సులున్నాయో యాప్​లో తెలుసుకోవచ్చు. ఒకవేళ బస్సులు లేకపోతే ఏ టైంకు వస్తాయో, ఆ బస్సు ఎక్కడుందో కూడా తెలుసుకోవచ్చు.

ఎదురు చూడనక్కర్లేదు

ఊర్లకు వచ్చే బస్సులను కొన్ని సందర్భాల్లో ఎలాంటి సమాచారం లేకుండానే రద్దు చేస్తుంటారు. బస్సులు ఎప్పుడొస్తాయో కూడా తెలియని పరిస్థితి. దీంతో బస్సు దొరకాలంటే ముందుగానే వెళ్లి బస్టాండ్​లో కూర్చోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు జీపీఎస్​తో వాటికి చెక్​ పెట్టొచ్చు. బస్సు ఎక్కడుందో, ఏ టైంకు వస్తుందో తెలుసుకుని బస్టాండుకు వెళ్లొచ్చు. ఎక్కువసేపు ఎదురుచూడాల్సిన అవసరం లేదు. జీపీఎస్​ ఆడవాళ్లకు మరింత ఉపయోగంగా ఉంటుంది. బస్సుల కోసం ఎదురు చూస్తున్న టైంలో వాళ్లు ఆకతాయిల వేధింపులు, చైన్​ స్నాచింగ్​ వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. జీపీఎస్​ వస్తే ఆ సమస్యా తగ్గే అవకాశాలున్నాయి. ఫిర్యాదు చేస్తే బస్సులోని జీపీఎస్​ ఆధారంగా పోలీసులు నిమిషాల్లోనే చేరుకునే వెసులుబాటు ఉంటుంది. అంతేగాకుండా పోలీస్​ కంట్రోల్​ రూంకు బస్సుల్లోని జీపీఎస్​ను అనుసంధానించడం ద్వారా ట్రాఫిక్​ వివరాలనూ తెలుసుకోనున్నారు పోలీసులు. బస్సు వేగంతో పాటు దాని కదలికలపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టొచ్చు. బస్సు మధ్యలో ఆగిపోయినా, ప్రయాణికులకు ఇబ్బందులు కలిగినా వెంటనే దాని వివరాలు తెలుస్తాయి. ఏపీలో ఇప్పటికే జీపీఎస్​ను పెట్టినా, యాప్​లో ఇబ్బందులొచ్చాయి. పనిచేయడం మానేసింది. నెలవుతున్నా సమస్య తీరలేదు. దీంతో ప్రయాణికులు మండిపడుతున్నారు.