గత 23 రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె పై సోమవారం హైకోర్టులో విచారణ జరగనుంది. రెండు రోజుల క్రితం కార్మిక సంఘాల నేతలతో జరిపిన చర్చల వివరాలను యాజమాన్యం కోర్టుకు సమర్పించనుంది. చర్చలను కార్మిక సంఘాలు బహిష్కరించి వెళ్లాయని కోర్టుకు తెలపనుంది ప్రభుత్వం. నిన్న ఆర్టీసీ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు సీఎం కేసీఆర్. కోర్టుకు నివేదించాల్సిన అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. కార్మిక సంఘాల తీరును తప్పుపట్టిన ముఖ్యమంత్రి.. కోర్టులో గట్టిగా వాదనలు వినిపించాలని చెప్పారు.
మరోవైపు ఆర్టీసీ అధికారులు కోర్టులో తమ వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఆర్టీసీ అధికారులు తమతో మొక్కుబడిగా చర్చలు జరిపారని తెలపనున్నారు. తాము ఇచ్చిన 46 డిమాండ్లపై చర్చించాలని కోరుతూ ఇంచార్జ్ ఎండీకి జేఏసీ లేఖ రాసింది. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం ఆగదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. చర్చల నుంచి అధికారులే మధ్యలో వెళ్లి పోయారన్నారు. చర్చలకు ఎప్పుడూ పిలిచినా సిద్ధంగా ఉన్నామని అశ్వాత్థామరెడ్డి తెలిపారు.

