
న్యూఢిల్లీ : టీమిండియా వన్డే జట్టులో ఓపెనర్ స్థానం కోసం అప్పట్లో మేనేజ్మెంట్ను బతిమాలుకున్నానని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ చెప్పాడు. ఓపెనర్గా మారిన తర్వాతే తన కెరీర్ మలుపుతిరిగిందని తెలిపాడు. జీవితంలో ఎదురైన సవాళ్లను యువత స్వీకరించాలని సూచించాడు. ‘1994లో ఆక్లాండ్లో కివీస్తో జరిగిన వన్డేలో తొలిసారిగా ఇన్నింగ్స్ ప్రారంభించాను. అప్పట్లో ప్రతీ జట్టు వికెట్లు కాపాడుకోవడమే లక్ష్యంగా ఆడేది. కానీ నేను ఆ గీతను చెరిపేశాను. బౌలర్లపై ఎదురుదాడికి దిగితే ఫలితం వస్తుందని భావించి ఓపెనర్ ప్లేస్ కోసం వేడుకున్నా. ఒకవేళ ఫెయిలైతే మళ్లీ ఆ ప్రస్తావన కూడా తీసుకురానని చెప్పా. ఆ మ్యాచ్లో 49 బాల్స్లో 82 రన్స్ చేశా.. దీంతో ఓపెనర్గా నన్ను పంపించండని మరోసారి అడగాల్సిన అవసరం రాలేదు’ అని మాస్టర్ గుర్తు చేసుకున్నాడు. మిడిలార్డర్ నుంచి ఓపెనర్గా మారిన సచిన్ ఆ తర్వాత తొలి ఐదు ఇన్నింగ్స్లో వరుసగా 82, 63, 40, 63, 73 స్కోర్లు చేశాడు. ఓపెనర్గానే తొలి వన్డే సెంచరీ కూడా సాధించాడు.