అంగళ్లులో టీడీపీ కార్యకర్తలే విధ్వంసం సృష్టించారు: సజ్జల

అంగళ్లులో టీడీపీ కార్యకర్తలే విధ్వంసం సృష్టించారు: సజ్జల

చిత్తూరు జిల్లా కురబలకోట మండలం అంగళ్లులో జరిగిన ఘటనపై  వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి  స్పందించారు.  చంద్రబాబు పిచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ ఘటన వెనుక వున్నది టీడీపీ నేతలేనని.. వాళ్లే దాడి చేసుకుని మాపై బురద జల్లుతున్నారని సజ్జల ఆరోపించారు. తాము ఎంత రెచ్చగొట్టినా సంయమనంతో వున్నామని.. అందుకే టీడీపీ నేతలు తిరగగలుగుతున్నారని రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. అంగళ్లు ఘటనలో యాక్షన్, రియాక్షన్ రెండూ చంద్రబాబుదేనని ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ చేయించి, దీని వెనుకున్న వారిని బయటకు తీసుకొస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. 

అంతకుముందు అంగళ్లులో చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న రోడ్ షోపై వైసీపీ నేతలు, కార్యకర్తలు రాళ్లదాడికి పాల్పడ్డారు. టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన బ్యానర్లను చించేసిన చంద్రబాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన టీడీపీ కార్యకర్తలపైనా రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో  పలువురు నేతలకు, కార్యకర్తలకు  గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన పోలీసులు లాఠీఛార్జీ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. పోలీస్ వాహనాలపై దాడులకు దిగిన వారు.. రెండింటికి నిప్పు పెట్టారు. దీంతో టీటీపీ కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. వారు శాంతించకపోవడంతో భాష్పవాయువు గోళాలను ప్రయోగించారు.