- సిబ్బంది చేతివాటంతో నష్టాలు
- కమీషన్ల కోసం ఇష్టారాజ్యంగా కొనుగోళ్లు
- ఆర్కేపీలో వెలుగు చూసిన రూ.40 లక్షల స్కామ్
భద్రాద్రికొత్తగూడెం/రామకృష్ణాపూర్, వెలుగు: సింగరేణి గనుల్లో డ్యూటీలు నిర్వహించే కార్మికులకు నిత్యావసర సరుకులు అందించాలనే ఉద్దేశంతో నెలకొల్పిన సింగరేణి సూపర్బజార్లు మూసివేత దిశగా పయనిస్తున్నాయి. సిబ్బంది చేతివాటంతో నష్టాలు రావడం, అదే సమయంలో అమ్మకాలు తగ్గడంతో ఇబ్బందులు మొదలయ్యాయి. శ్రీరాంపూర్లోని కౌంటర్ను నష్టాలతో ఇప్పటికే మూసివేయగా తాజాగా రామకృష్ణాపూర్సింగరేణి సూపర్బజార్లో రూ.40 లక్షల స్కామ్వెలుగుచూసింది. ఆడిట్ ఆఫీసర్లు ఎంక్వైరీ చేస్తే స్కామ్ తీవ్రత మరింత పెరగవచ్చని ప్రచారం జరుగుతోంది. సింగరేణిలో పనిచేస్తున్న ఉద్యోగులకు కావాల్సిన నిత్యావసర వస్తువులు తక్కువ ధరకు అందించాలనే ఉద్దేశంతో 1974లో సింగరేణి ఎంప్లాయీస్ మెంబర్షిప్ (రూ.361)తో కంపెనీ సూపర్బజార్లను ఏర్పాటు చేసింది.
మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, ఖమ్మం, భద్రాది కొత్తగూడెం జిల్లాల్లో సుమారు 26 డిపోలు(సూపర్ బజార్లు), ఎంప్లాయీస్, ఆఫీసర్లకు వంటగ్యాస్ సిలిండర్ల సప్లయ్ కోసం 18 గ్యాస్ ఏజెన్సీలు నడుపుతున్నారు. ఇందులో వందకుపైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. 2016–17లో సింగరేణి సూపర్బజార్లను ప్రైవేట్మాల్స్కు దీటుగా తీర్చిదిద్దారు. తక్కువ ధరకు క్వాలిటీ సరుకులు అందించడంతో ఒక్కసారిగా అన్ని విక్రయ కౌంటర్లలో సగటున నెలకు రూ.20 నుంచి 25లక్షల చొప్పున అమ్మకాలు జరిగాయి. సూపర్బజార్లలో ఇంట్లోకి అవసరమయ్యే నిత్యావసరాలతో పాటు ఏసీలు, కూలర్లు, మిక్సీలు, కలర్టీవీలు, ఫ్రిడ్జ్లు విక్రయించేవారు. సింగరేణి ఎంప్లాయీస్కు ఈఎంఐ ద్వారా వస్తువులు, సరుకులు తీసుకునే వెసులుబాటు కల్పించారు. ఆఫీసర్ల పర్యవేక్షణ లోపించడంతో ఇటీవలి కాలంలో విక్రయాలు రూ. 3 నుంచి 4 లక్షలకు పడిపోయాయి.
సిబ్బంది చేతివాటం
సింగరేణి సూపర్బజార్ల మనుగడపై సిబ్బంది చేతివాటం తీవ్ర ప్రభావం చూపుతోంది. తరచూ వివిధ రూపాల్లో స్కామ్లు బయటకు వస్తున్నా సంబంధిత ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. రామకృష్ణాపూర్సూపర్బజార్లోని గ్యాస్కౌంటర్ను తనిఖీ చేసిన అడిట్ఆఫీసర్లు సుమారు రూ.36 లక్షల వరకు స్కామ్ జరిగినట్లు గుర్తించారు. ఇందుకు సూపర్ మార్కెట్కౌంటర్సెల్స్మెన్ ను బాధ్యుడిగా గుర్తించారు. గ్యాస్ కౌంటర్ సేల్స్మెన్ నిత్యం వసూలైన డబ్బులను బ్యాంకులో జమ చేయాలి. అతనికి బదులు సూపర్మార్కెట్ సేల్స్మెన్ జమ చేయడం స్కామ్కు కారణమైంది. ఆ సేల్స్మెన్సూపర్బజార్కు సంబంధించిన డబ్బులను ఓచర్లపై ఎక్కువ రాసి బ్యాంకులో మాత్రం తక్కువ జమ చేశాడు. అలా మిగుల్చుకున్న మొత్తాన్ని సొంతానికి వాడుకున్నట్లు ఆఫీసర్లు గుర్తించారు. ఈ తతంగం గత ఏడాది డిసెంబర్ నుంచి జరుగుతున్నా ఆఫీసర్ల పర్యవేక్షణ లేకుండా పోయింది. దీనికితోడు మరొకరు సైతం రూ.10 లక్షల వరకు వాడుకున్నట్లు తెలుస్తోంది.
గతంలో మందమర్రి సూపర్బజార్లో సేల్స్మెన్ రూ.12లక్షల స్కామ్చేసి రెండేళ్లుగా పత్తా లేకుండా పోయాడు. శ్రీరాంపూర్ కృష్ణాకాలనీలో రూ.4 లక్షల కుంభకోణం జరిగింది. తాజాగా అదే ఏరియా పరిధిలో మరో ఇద్దరు రూ. 6 లక్షల వరకు సొంతానికి వాడుకున్నట్లు గుర్తించారు. ఇల్లా ప్రతిచోట సిబ్బంది చేతివాటం ప్రదర్శించడం నష్టాలకు కారణమవుతోంది. నష్టాలు వస్తున్నాయని శ్రీరాంపూర్ కాలనీలోని సూపర్బజార్ను కొద్దిరోజుల కింద మూసివేశారు. రెండు మూడేళ్లుగా అవసరం లేని సరుకులు కొనుగోలు చేయడంతో అమ్మకాలు లేక రూ.35 లక్షల విలువైన సామగ్రి నిరుపయోగంగా ఉన్నట్లు సమాచారం. మార్చి 28న శ్రీరాంపూర్కృష్ణాకాలనీ కౌంటర్ దహనమైన ఘటనపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. అక్రమాలు బయటపడకుండా ఉద్దేశపూర్వకంగా తగలబెట్టారనే ప్రచారం జరుగుతోంది. దహనం విషయంపై స్థానిక పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.
గాడిలో పెట్టేందుకు చర్యలు
కోల్బెల్ట్వ్యాప్తంగా సింగరేణి సూపర్బజార్లను గాడిలో పెట్టేందుకు చర్యలు చేపట్టాం. కొన్ని అక్రమాలు జరిగినట్టు మా దృష్టికి వచ్చింది. వాటిపై విచారణకు ఆదేశించాం. ఆడిట్లో కొన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. అవినీతికి పాల్పడ్డవారిపై చర్యలు తీసుకుంటాం.
– ఎ. ఆనందరావు, చైర్మన్, సింగరేణి కోఆపరేటివ్ సెంట్రల్ సూపర్ బజార్ సొసైటీ
