ఏం సాధించారని సంబురాలు ఎంపీ బండి సంజయ్ నిలదీత

ఏం సాధించారని సంబురాలు ఎంపీ బండి సంజయ్ నిలదీత

హైదరాబాద్, వెలుగు: రుణమాఫీ అమలు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను తప్పిందని కేంద్ర మంత్రి బండిసంజయ్ విమర్శించారు. గత ఎన్నికల్లో రూ.2 లక్షలోపు రుణాలు తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ కొర్రీలు పెడుతూ కొద్దిమందికే రుణమాఫీ చేయడం దుర్మార్గమని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 39 లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తుంటే.. 11 లక్షల మందికి మాత్రమే రుణమాఫీని వర్తింపజేస్తుండటం అన్యాయమని గురువారం ఓ ప్రకటనలో ఆయన మండిపడ్డారు. 

ఈ లెక్కన నూటికి 70 శాతం మంది రైతులకు రుణమాఫీ వర్తించలేదన్నారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి(ఎస్ఎల్బీసీ) లెక్కల ప్రకారం రాష్ట్రంలో రైతులు తీసుకున్న రుణాల మొత్తం రూ.64 వేల కోట్లకు పైమాటే. అందులో 10వంతు మాత్రమే చెల్లించి సంబురాలు చేసుకోవడం హాస్యాస్పదమన్నారు.