కైరో: ప్రతిష్టాత్మక ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ చాంపియన్షిప్స్లో ఇండియా యంగ్ షూటర్ సామ్రాట్ రాణా చరిత్ర సృష్టించాడు. మెన్స్ 10 మీ. ఎయిర్ పిస్టల్లో గోల్డ్ నెగ్గి వరల్డ్ చాంపియన్ అయ్యాడు. దాంతో ఓ ఒలింపిక్ విభాగంలో ఈ ఘనత సాధించిన ఇండియా తొలి పిస్టల్ షూటర్గా రికార్డుకెక్కాడు. సోమవారం ఉత్కంఠగా సాగిన ఫైనల్లో 20 ఏండ్ల సామ్రాట్ 243.7 స్కోరుతో టాప్ ప్లేస్తో బంగారు పతకం నెగ్గాడు.
మరో ఇండియన్ వరుణ్ తోమర్ 221.7 స్కోరుతో మూడో ప్లేస్తో బ్రాంజ్ గెలవగా.. చైనాకు చెందిన హు కై 243.3 స్కోరుతో సిల్వర్ అందుకున్నాడు. 10 మీ. పిస్టల్ టీమ్ ఈవెంట్లోనూ సామ్రాట్ గోల్డ్ నెగ్గాడు. ఫైనల్లో సామ్రాట్ , వరుణ్, శ్రవణ్తో కూడిన ఇండియా జట్టు 1754 స్కోరుతో స్వర్ణం అందుకుంది. మరోవైపు తెలంగాణ స్టార్ షూటర్ ఇషా సింగ్ విమెన్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో సిల్వర్ అందుకుంది.
ఫైనల్లో డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ మను భాకర్, వరల్డ్ నంబర్ వన్ సురుచి ఇందర్ సింగ్, ఇషా త్రయం 1740 స్కోర్తో రెండో స్థానం సాధించింది. ఇషా 583 పాయింట్లతో సత్తా చాటగా.. భాకర్ (580), సురుచి (577) కూడా మెప్పించారు. అయితే, వ్యక్తిగత ఫైనల్లో ఇషా 6, భాకర్ 7వ స్థానాలతో నిరాశ పరిచారు.
