
న్యూఢిల్లీ : తమ ఫోన్లను పోగొట్టుకున్న దేశ ప్రజలు వాటిని ట్రాక్లేదా బ్లాక్ చేయడానికి వీలు కల్పించే సంచార్ సాథీ పోర్టల్ను డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికం మంగళవారం లాంఛ్ చేసింది. పోయిన తమ మొబైల్స్ ట్రాక్ లేదా బ్లాక్ చేసుకోవడంతోపాటు, ఇంతకు ముందు వేరెవరైనా వాడిన డివైస్ను కొనుగోలు చేసే ముందు ఆ డివైస్ సరైనదేనా, కాదా అనే అంశాన్ని కూడా సంచార్ సాథీ పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చని ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. సంచార్ సాథీ మొదటి దశ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్(సీఈఐఆర్).
" ఫోన్ పోగొట్టుకున్న వారెవరైనా ఈ పోర్టల్ను ఆశ్రయించొచ్చు. ఐడెంటిటీ వెరిఫికేషన్, అవసరమైన అండర్టేకింగ్ ఇచ్చిన వెంటనే ఈ పోర్టల్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజన్సీలు, టెలికం సర్వీస్ ప్రొవైడర్లతో ఈ సంచార్ సాథీ పోర్టల్ ఇంటరాక్ట్అయి, పోయిన ఫోన్ బ్లాక్అయ్యేలా చూస్తుందని" వైష్ణవ్ వివరించారు. యూజర్ సేఫ్టీ విషయంలో ప్రధాన మంత్రికి స్పష్టమైన విజన్ ఉందని, ఆ విజన్కు తగినట్లుగానే సంచార్ సాథీ ఉంటుందని పేర్కొన్నారు. వాట్సప్కాల్స్ ద్వారా జరుగుతున్న మోసాలపై అడిగిన ప్రశ్నకు, మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడుతున్న వాట్సప్ అకౌంట్లను డీయాక్టివేట్ చేయడానికి మెటా కంపెనీ ఒప్పుకుందని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
కస్టమర్ల సేఫ్టీ అత్యంత ముఖ్యమైనదేనని వాట్సప్ కూడా తమతో ఏకీభవించిందని పేర్కొన్నారు. అలాగే ఫ్రాడ్స్కు పాల్పడే వారుగా గుర్తించిన యూజర్లను డీరిజిస్టర్ చేయడానికి ఓటీటీలు అంగీకరించాయని చెప్పారు. దేశంలో మోసాలకు పాల్పడుతున్నవిగా గుర్తించిన 36 లక్షల మొబైల్స్ను డిస్కనెక్ట్ చేశామని, సమాంతరంగా వాటి వాట్సప్ అకౌంట్లు కూడా బ్లాకయ్యాయని మంత్రి వివరించారు. సంచార్ సాథీ పోర్టల్లోని నో యువర్ మొబైల్ ఫెసిలిటీ ద్వారా సెకండ్ హ్యాండ్ మొబైల్కొనేవారు, ఆ హ్యాండ్సెట్పై వేరేదైనా నెంబర్స్ పనిచేస్తున్నాయా అనేది తెలుసుకోవచ్చని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ తాజా చొరవతో నానాటికీ ఎక్కువవుతున్న సైబర్ మోసాలను కట్టడి చేయగలుగుతామనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. తమకు తెలియకుండా, తమ అనుమతి లేకుండా తమ పేరుతో ఏవైనా మొబైల్ నెంబర్లు పనిచేస్తున్నాయా అనే అంశం తెలుసుకోవడానికి టీఏఎఫ్సీఓపీ ఫెసిలిటీ సంచార్ సాథీలో ఉందని అన్నారు.