
ఉద్యోగం ఇవ్వాలని కేటీఆర్కు
దివ్యాంగుడి ట్వీట్
హైదరాబాద్లో కలిసిన రామారావు
డేటా ఎంట్రీ ఉద్యోగం ఇప్పిస్తానని హామీ
హైదరాబాద్, వెలుగు : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనకు వచ్చిన ట్వీట్ కు స్పందించి గురువారం సందీప్ అనే దివ్యాంగుడిని హైదరాబాద్ లో కలిశారు. రంగారెడ్డి జిల్లాలోని మైలార్దేవ్పల్లి గ్రామానికి చెందిన సందీప్ కుమార్ అనే వికలాంగుడు ఉపాధి అవకాశం కోరుతూ ట్విట్టర్లో కేటీఆర్ను సంప్రదించాడు. దీనికి స్పందించిన కేటీఆర్ అతన్ని కలిసి మాట్లాడారు. సందీప్ వికలాంగుడైనప్పటికీ తన స్కిల్స్ పెంచుకోవడంలో తన పట్టుదలతో వైకల్యాన్ని జయించాడు. సందీప్ కంప్యూటర్ పట్ల విఙ్ఞానం పెంచుకుని ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను నిర్వహించడం కూడా నేర్చుకున్నాడు.
తన సోషల్ మీడియా నైపుణ్యాలను ఉపయోగించి సందీప్ కేటీఆర్కు ట్వీట్ చేశాడు. సందీప్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాను సృష్టించి ట్వీట్ చేసినట్లు తెలిసి కేటీఆర్ ఆశ్చర్యపోయారు. కేటీఆర్ చాలా ప్రేమగా సందీప్ ను పలకరించి అతని ఆరోగ్యం గురించి ఆరా తీశారు. సందీప్కు ఆసరా పెన్షన్ సకాలంలో అందుతుందా అని ఆరా తీశారు. సందీప్ తరఫున మాట్లాడుతూ, అతని తల్లి లక్ష్మీ సందీప్కు ఉపాధి అవకాశాన్ని కల్పించాలని కేటీఆర్ను అభ్యర్థించారు. దీనికి కేటీఆర్ వెంటనే అంగీకరించి సందీప్కు తమ గ్రామంలో డేటా ఎంట్రీ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. వారికి ప్రభుత్వం నుండి ఇల్లు కూడా ఇప్పిస్తానని వాగ్ధానం చేశారు.
My pleasure Sandeep ? https://t.co/MN47vqPh00
— KTR (@KTRTRS) August 2, 2019