ఈరోజుల్లో ఫొటోలు, సెల్ఫీలు, వీడియోలు తీసుకోవడం కామన్. కొత్త ప్లేస్కి వెళ్లినా, కొత్తగా ఏదైనా చేసినా అందరికీ తెలియాలి అని వాట్సప్ స్టేటస్, ఇన్స్టాగ్రామ్ పోస్ట్లు పెడుతుంటారు. పైగా వాటిని నచ్చినట్లు ఎడిట్ చేసుకుంటారు. ఇలాంటి టెక్నాలజీలు బోలెడున్నాయి. కానీ, ఏ కాలంలోనైనా మనసును తాకే జ్ఞాపకం ఆర్ట్. బొమ్మ గీసి, రంగులద్ది అందమైన పెయింటింగ్లా తీర్చిదిద్దితే అది చూసిన వాళ్లకి నచ్చుతుంది. కాకపోతే ఈ టాలెంట్ కొంత మందికే సొంతం. ఆ టాలెంట్నే పెట్టుబడిగా పెట్టి సంపాదిస్తున్నాడు ఆర్టిస్ట్ సందేశ్.
నిర్మల్ జిల్లా భైంసా మండలం పెండ పల్లె గ్రామానికి చెందిన సందేశ్కు ఆర్ట్ అంటే చాలా ఇష్టం. ఆ ఇంట్రెస్ట్తోనే గత పదేండ్లుగా పెయింటింగ్ వేస్తున్నాడు. ఇప్పటికే మన దేశ ప్రధాని, పలు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ నాయకులు, పోలీస్ల పేయింటింగ్స్ వేశాడు. సందేశ్ది వ్యవసాయ కుటుంబం. బెంగళూరులో తెలిసినవాళ్ల దగ్గర ఉంటూ బ్యాచ్లర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాడు. చిన్నప్పటి నుంచే ఆర్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉండడంతో ఆర్ట్ కోర్సులో చేరాడు. దాంతో తన టాలెంట్ ఇంకొంచెం ఇంప్రూవ్ అయింది. ఎదురుగా నిలబడితే కొన్ని నిమిషాల్లోనే బొమ్మ గీసి చేతిలో పెట్టేస్తాడు. అలా ఇప్పటికే వందలాది పెయింటింగ్లు వేసి కర్ణాటకలో కొన్ని ఎగ్జిబిషన్లలో పెట్టాడు. అంతేకాదు, అరుదైన వస్తువులు, నాణేలు, పుస్తకాలు, కెమెరాలు, వంటివి కలెక్ట్ చేస్తుంటాడు. ఇవి ఎంత దూరంలో ఉన్నా కూడా సొంత ఖర్చులు పెట్టుకొని సేకరిస్తాడు.
సందేశ్ వేసిన పెయింటింగ్లు చూసి కొంతమంది ఆర్థిక సాయం కూడా అందించేవాళ్లు. ఐదు వందల ఏండ్ల నాటి జ్ఞాపకాలు పెయింటింగ్స్ వేయగా వచ్చిన డబ్బులతో ఐదు వందల ఏండ్ల నాటి వస్తువులు కలెక్ట్ చేశాడు సందేశ్. బ్రిటిష్ కాలం నాటి స్టాంప్లు, కొన్ని దేశాల కెమెరాలు, రకరకాల నాణేలు, వందేండ్ల కిందటి న్యూస్ పేపర్స్, జాతి రాళ్లు, రాజుల కాలం నాటి వస్తువులు సేకరించాడు. వీటిని చూసినవాళ్లంతా అతడినెంతో అభినందిస్తున్నారు.
– భైంసా, వెలుగు