- జిల్లాలో పర్యటించిన ఎన్ సీడీసీ బృందం
సంగారెడ్డి టౌన్, వెలుగు: నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్ సీడీసీ), యునైటెట్ నేషన్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం (యూఎన్ డీపీ) సంయుక్తంగా వన్ హెల్త్ పైలట్ ప్రాజెక్ట్ ఫీల్డ్ అసెస్మెంట్ లో భాగంగా సోమవారం ప్రతినిధుల బృందం సంగారెడ్డి జిల్లాను సందర్శించాయి. కలెక్టర్ ప్రావీణ్యను కలిసి ప్రాజెక్ట్ లక్ష్యాలు, అమలు విధానం గురించి చర్చించారు
. అనంతరం టీ హబ్ ను సందర్శించి ప్రస్తుత పరీక్షా సదుపాయాలు, డిజిటల్ రిపోర్టింగ్ వ్యవస్థలు, వ్యాధి నిర్ధారణ సామర్థ్యాన్ని పరిశీలించారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని సందర్శించి సూపరింటెండెంట్, ప్రొఫెసర్లతో సమావేశమై జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధుల నిర్ధారణ, నివారణ చర్యలపై చర్చించారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆఫీసులో వివిధ శాఖల ప్రతినిధులతో సంప్రదింపులు నిర్వహించారు.
తర్వాత మంజీరా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారు. జిల్లాలో వన్ హెల్త్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా వ్యాధులను ముందస్తుగా గుర్తించి నియంత్రించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో వసంతరావు, వన్ హెల్త్ కన్సల్టెంట్ అతుల్ ఆనంద్, ఎంటమాలజిస్ట్ వెట్రివేల్, కార్డిలియా ఎపిడెమియాలజిస్ట్ సయన్ రాయ్, ప్రోగ్రాం ఆఫీసర్లు, అధికారులు పాల్గొన్నారు.
