
- సంగారెడ్డి జిల్లాలో 14కు చేరనున్న మున్సిపాలిటీల సంఖ్య
సంగారెడ్డి/జిన్నారం, వెలుగు: సంగారెడ్డి జిల్లాలో మరో రెండు మున్సిపాలిటీల ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. పటాన్ చెరువు మండలంలోని ఇంద్రేశం, జిన్నారం మండలంలోని జిన్నారం గ్రామాలను మున్సిపాలిటీలుగా అప్ గ్రేడ్ చేస్తూ క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా జిల్లా యంత్రాంగం రెడీ చేసింది. ఈ క్రమంలో గెజిట్ కూడా రిలీజ్ కానుంది. ఇప్పటికే జిల్లాలో 12 మున్సిపాలిటీలు ఉండగా, కొత్తగా ఏర్పడే మున్సిపాలిటీలతో కలిపి ఆ సంఖ్య 14కు చేరనుంది. ఈ ఏడాది మొదట్లో జిల్లాలో 8 మున్సిపాలిటీలు ఉండగా, ఫిబ్రవరిలో 4 మున్సిపాలిటీలు కొత్తగా ఏర్పడ్డాయి. ఇప్పుడు 4 నెలల వ్యవధిలోనే మరో రెండు మున్సిపాలిటీల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
జిన్నారం, ఇంద్రేశంలో...
జిన్నారం, ఇంద్రేశం గ్రామాలను మున్సిపాలిటీలుగా అప్ గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న క్రమంలో విలీన ప్రక్రియపై వేగంగా పనులు జరుగుతున్నాయి. జిన్నారం మండలంలోని 10 గ్రామాలు జిన్నారం, ఊట్ల, మంగంపేట, సోలక్ పల్లి, అండూరు, రాళ్లకత్వ, శివానగర్, కొడకంచి, జంగంపేట, నల్తూరు పంచాయతీలను కలుపుతూ జిన్నారం మున్సిపాలిటీ ఏర్పాటు కానున్నది. పటాన్ చెరు మండలంలోని ఇంద్రేశం, పెద్దకంజర్ల, చిన్నకంజర్ల, రామేశ్వరం బండ, బచ్చుగూడ, ఐనోల్ గ్రామాలను కలుపుతూ ఇంద్రేశం మున్సిపాలిటీ ఏర్పడనుంది.
మొదట్లో జిన్నారం పరిధిలో 16 పంచాయతీలు ఉండగా, ఇందులోని ఐడీఏ బొల్లారం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంతో 2018లో మున్సిపాలిటీగా మార్చారు. ఆ తర్వాత 15 పంచాయతీలతో మండల పరిషత్ కొనసాగుతూ రాగా, ఐదు నెలల క్రితం కొత్తగా ఏర్పడిన గడ్డపోతారం మున్సిపాలిటీలోకి ఐదు గ్రామాలను విలీనం చేశారు. అయితే మిగిలిన ఆ 10 గ్రామ పంచాయతీలతో ఇప్పుడు జిన్నారం కేంద్రంగా కొత్త మున్సిపాలిటీ ఏర్పాటు కానుంది. దీంతో జిన్నారం మండల, పంచాయతీ పాలనకు చెక్ పడనుంది. పంచాయతీ పాలన నుంచి మున్సిపల్ పాలనకు మారుతున్న క్రమంలో ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. పన్నుల భారం, 90 శాతం మంది ప్రజలు వ్యవసాయం మీదే ఆధారపడడం, దూరభారం, మున్సిపల్ ఆదాయానికి పెద్దగా వనరులు లేకపోవడం వంటి కారణాలతో ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.
పటాన్ చెరువులోనే 8 మున్సిపాలిటీలు
ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో పంచాయతీల పాలనకు బ్రేక్ పడనుంది. హైదరాబాద్ కు ఆనుకుని ఉన్న పటాన్ చెరు అసెంబ్లీ సెగ్మెంట్లో ఇక 8 మున్సిపాలిటీలు పాలన అందించనున్నాయి. ఈ నియోజకవర్గంలో ఐదు నెలలకు ముందు అమీన్ పూర్, తెల్లాపూర్, ఐడీఏ బొల్లారం (మూడు) బల్దియాలు మాత్రమే ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరిలో మరో మూడు గుమ్మడిదల, ఇస్నాపూర్, గడ్డపోతారం మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఇంద్రేశం మేజర్ గ్రామ పంచాయతీ తోపాటు మండల కేంద్రంగా ఉన్న జిన్నారం మున్సిపాలిటీగా మారబోతున్నాయి. అయితే జిల్లాలో ఉన్న ఐదు నియోజకవర్గాల్లో మొత్తం 14 మున్సిపాలిటీలలో సంగారెడ్డిలో 2, జహీరాబాద్ లో 2, నారాయణఖేడ్ లో 1, అందోల్ లో 1, పటాన్ చెరు సెగ్మెంట్ లో 8 (కొత్త వాటితో కలిపి) బల్దియాలు ఉన్నాయి. -