- కేసీఆర్కు ఉద్యమకారులను దూరం చేసిన దుర్మార్గుడు
- సీఎం రేవంత్రెడ్డికి ప్రధాన గూఢచారి
- కేసీఆర్ తినే ఇడ్లీ ఇన్ఫర్మేషన్ కూడా చేరవేసే స్పై
- గద్దర్ లాంటి వాళ్లను గంటల కొద్దీ గేటు బయట వెయిట్ చేయించిండు
- స్మగ్లర్లకు ప్రభుత్వమంటే భయం లేకుండా పోయిందని వ్యాఖ్య
- నిమ్స్లో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ సౌమ్యకు పరామర్శ
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు, పార్టీ నేతలకు కేసీఆర్ దూరమవ్వడానికి కారణం సంతోష్ రావేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. గద్దర్ లాంటి ఉన్నతమైనవాళ్లు గంటలు గంటలు గేట్బయట వేచి ఉండడానికి, ఈటల వంటి నేతలు బయటకు వెళ్లిపోవడానికి ఈ సంతోష్ రావే కారణమని ఫైర్ అయ్యారు. తాను గతంలో చెప్పిన దయ్యాల్లో మొదటి దయ్యం సంతోషేనన్నారు.
సీఎం రేవంత్రెడ్డికి ప్రధాన గూఢచారి అని ఆరోపించారు. కేసీఆర్ ఇడ్లీ తిన్నారా.. సగం ఇడ్లీ తిన్నారా వంటి సమాచారాన్ని కూడా సీఎంకు చేరవేస్తున్నారని ఆరోపించారు. అలాంటి సంతోష్ను సిట్ పిలవడం మంచిదేనని, ఆయనకు శిక్ష పడుతుందన్న నమ్మకం మాత్రం తనకు లేదని పేర్కొన్నారు. ఆ గూఢచారిని సీఎం శిక్షిస్తారని అనుకోవడం లేదన్నారు.
అలాంటి దుర్మార్గుడికి కేటీఆర్, హరీశ్ రావు ఎందు కు వత్తాసు పలుకుతున్నారో అర్థం కావడం లేదని వాపోయారు. గంజాయి స్మగ్లర్ల దాడిలో గాయపడి నిమ్స్లో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను మంగళవారం కవిత పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. చట్టం తనపని తాను చేసుకుపోతే.. దుర్మార్గుడు సంతోష్కు శిక్ష పడుతుందన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాజకీయ ఒత్తిళ్లకు లొంగిపోకుండా పోలీసులు తమ పని తాము చేయాలని కోరారు. ఒక్కోసారి మన నీడ కూడా మన కళ్లను కప్పే పరిస్థితి వస్తుందన్నారు. కేసీఆర్కు ఉద్యమకారులను దూరం చేసిన పాపం కచ్చితంగా ఆ దుర్మార్గుడికి తగులుతుందన్నారు.
స్మగ్లర్లకు భయం లేకుండా పోయింది..
సౌమ్య ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్సైజ్ కానిస్టేబుల్ను చంపే ధైర్యం చేశారంటే గంజాయ్ బ్యాచ్కు ప్రభుత్వమంటే ఏమాత్రం భయం లేదని అర్థమవుతున్నదన్నారు. రాష్ట్రాన్ని డ్రగ్స్, గంజాయి ఫ్రీగా మారుస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని.. కానీ, గ్రామాల్లోనూ గంజాయి, డ్రగ్స్ కూడా ఫ్రీగా దొరికే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. స్కూల్ లోకి కూడా గంజాయి, డ్రగ్స్ తీసుకొచ్చి పిల్లలను పాడు చేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. వీటి వల్ల ఆడవాళ్లే బాధితులుగా మారుతున్నారన్నారు.
గృహహింసకు అవే కారణమవుతున్నాయన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మత్తు వదిలి డ్రగ్స్, గంజాయి మాఫియాపై వారి ప్రతాపం చూపాలన్నారు. ఎక్సైజ్, ఫారెస్ట్ సిబ్బందికి వెపన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వాళ్లకు ట్రైనింగ్లో గన్ఫైరింగ్పై శిక్షణనిస్తారని.. కానీ, ఇప్పుడు వెపన్స్ ఇవ్వడం లేదని పేర్కొన్నారు. కాబట్టి ఎక్సైజ్, ఫారెస్ట్ సిబ్బందికి ఆయుధాలిస్తే స్మగ్లర్లకు భయం ఉంటుందన్నారు. డ్రగ్స్, గంజాయి మహమ్మారిని తరిమికొట్టేందుకు జాగృతి నేతలు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఏదైనా సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు ఇవ్వాలన్నారు. గంజాయి స్మగ్లర్ల దాడిలో గాయపడిన కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి అండగా ఉంటామని కవిత హామీ ఇచ్చారు.
