కవిత జాగృతికి శరత్ చంద్రారెడ్డి నుంచి రూ. 80 లక్షలు..

కవిత జాగృతికి శరత్ చంద్రారెడ్డి నుంచి రూ. 80 లక్షలు..

ఢిల్లీ లిక్కర్ పాలసీలో లబ్ధి పొందేందుకు కవితకు చెందిన తెలంగాణ జాగృతి సంస్థకు కార్పొరేట్​ సోషల్​ రెస్పాన్సిబులిటీ (సీఎస్ఆర్) కింద శరత్ చంద్రారెడ్డి రూ.80 లక్షలు ఇచ్చారని సీబీఐ తెలిపింది. శరత్ చంద్రారెడ్డికి చెందిన అరబిందో గ్రూప్స్​లోని  ‘అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్’ ద్వారా 2021 మార్చిలో ఈ నగదు బదిలీ జరిగినట్లు పేర్కొంది. ఇందుకు ప్రతిఫలంగా ఢిల్లీ లిక్కర్​ వ్యాపారంలో అవకాశం ఇస్తామని శరత్​ చంద్రారెడ్డికి కవిత హామీ ఇచ్చారని సీబీఐ వెల్లడించింది. 

భూమి సేల్​ డీడ్​ తీసి రూ.14 కోట్లు

ఢిల్లీ లిక్కర్ పాలసీ 2021–- 22 ప్రకారం ఒకే సంస్థకు రెండు రిటైల్ జోన్ల కంటే మించి కేటాయించవద్దనే రూల్​ ఉందని సీబీఐ తెలిపింది. అయితే ఈ రూల్​కు విరుద్ధంగా మూడు సంస్థలకు 5 రిటైల్​ జోన్లు కేటాయించారని పేర్కొంది. ఈ మూడు సంస్థలు శరత్ చంద్రారెడ్డివని ఆధారాలను కోర్టుకు సీబీఐ సమర్పించింది. ఇట్ల జోన్లు  కేటాయించినందుకు ప్రతిఫలంగా శరత్​చంద్రారెడ్డి నుంచి కవిత రూ. 14 కోట్ల భూ సేల్​ డీడ్​ ద్వారా లబ్ధిపొందారని తెలిపింది. మహబూబ్ నగర్​లోని తన అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేసేందుకు సేల్ అగ్రిమెంట్ కుదుర్చుకోవాల్సిందిగా శరత్ చంద్రారెడ్డిపై కవిత ఒత్తిడి చేశారని.. ఈ స్థలం కొనడం ఇష్టం లేదని, ఈ ల్యాండ్ విలువ ఏమిటో కూడా తనకు తెలియదని శరత్ చంద్రారెడ్డి చెప్పినా ఆమె పట్టించుకోలేదని సీబీఐ వివరించింది. వెంటనే రూ.14 కోట్లు ఇవ్వాలని శరత్ చంద్రా రెడ్డిని కవిత డిమాండ్ చేశారని, దీంతో 2021 జులైలో అరబిందో గ్రూప్స్​లోని ‘మహిర వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్’కు చెందిన బ్యాంక్ అకౌంట్ ద్వారా ఆయన భూమిని కొనుగోలు చేశారని తెలిపింది. తొలుత 2021 జులైలో రూ.7 కోట్లు,  అదే ఏడాది నవంబర్​లో మరో రూ.7 కోట్లు కవితకు చెల్లించారని ఎవిడెన్స్​ను కోర్టుకు సీబీఐ సమర్పించింది. అయితే.. సేల్​ డీడ్​ తీసినప్పటికీ ఎలాంటి భూ మార్పిడి జరగలేదని పేర్కొంది.