![కవిత జాగృతికి శరత్ చంద్రారెడ్డి నుంచి రూ. 80 లక్షలు..](https://static.v6velugu.com/uploads/2024/04/181_L8XROga1FC.jpg)
ఢిల్లీ లిక్కర్ పాలసీలో లబ్ధి పొందేందుకు కవితకు చెందిన తెలంగాణ జాగృతి సంస్థకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్ఆర్) కింద శరత్ చంద్రారెడ్డి రూ.80 లక్షలు ఇచ్చారని సీబీఐ తెలిపింది. శరత్ చంద్రారెడ్డికి చెందిన అరబిందో గ్రూప్స్లోని ‘అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్’ ద్వారా 2021 మార్చిలో ఈ నగదు బదిలీ జరిగినట్లు పేర్కొంది. ఇందుకు ప్రతిఫలంగా ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో అవకాశం ఇస్తామని శరత్ చంద్రారెడ్డికి కవిత హామీ ఇచ్చారని సీబీఐ వెల్లడించింది.
భూమి సేల్ డీడ్ తీసి రూ.14 కోట్లు
ఢిల్లీ లిక్కర్ పాలసీ 2021–- 22 ప్రకారం ఒకే సంస్థకు రెండు రిటైల్ జోన్ల కంటే మించి కేటాయించవద్దనే రూల్ ఉందని సీబీఐ తెలిపింది. అయితే ఈ రూల్కు విరుద్ధంగా మూడు సంస్థలకు 5 రిటైల్ జోన్లు కేటాయించారని పేర్కొంది. ఈ మూడు సంస్థలు శరత్ చంద్రారెడ్డివని ఆధారాలను కోర్టుకు సీబీఐ సమర్పించింది. ఇట్ల జోన్లు కేటాయించినందుకు ప్రతిఫలంగా శరత్చంద్రారెడ్డి నుంచి కవిత రూ. 14 కోట్ల భూ సేల్ డీడ్ ద్వారా లబ్ధిపొందారని తెలిపింది. మహబూబ్ నగర్లోని తన అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేసేందుకు సేల్ అగ్రిమెంట్ కుదుర్చుకోవాల్సిందిగా శరత్ చంద్రారెడ్డిపై కవిత ఒత్తిడి చేశారని.. ఈ స్థలం కొనడం ఇష్టం లేదని, ఈ ల్యాండ్ విలువ ఏమిటో కూడా తనకు తెలియదని శరత్ చంద్రారెడ్డి చెప్పినా ఆమె పట్టించుకోలేదని సీబీఐ వివరించింది. వెంటనే రూ.14 కోట్లు ఇవ్వాలని శరత్ చంద్రా రెడ్డిని కవిత డిమాండ్ చేశారని, దీంతో 2021 జులైలో అరబిందో గ్రూప్స్లోని ‘మహిర వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్’కు చెందిన బ్యాంక్ అకౌంట్ ద్వారా ఆయన భూమిని కొనుగోలు చేశారని తెలిపింది. తొలుత 2021 జులైలో రూ.7 కోట్లు, అదే ఏడాది నవంబర్లో మరో రూ.7 కోట్లు కవితకు చెల్లించారని ఎవిడెన్స్ను కోర్టుకు సీబీఐ సమర్పించింది. అయితే.. సేల్ డీడ్ తీసినప్పటికీ ఎలాంటి భూ మార్పిడి జరగలేదని పేర్కొంది.