అనుకున్నది సాధించిన సెలక్టర్లు: ఫామ్‌ కోల్పోయిన సర్ఫరాజ్!

అనుకున్నది సాధించిన సెలక్టర్లు: ఫామ్‌ కోల్పోయిన సర్ఫరాజ్!

'సర్ఫరాజ్ ఖాన్ vs బీసీసీఐ సెలెక్టర్లు..' కొద్దిరోజుల కిందట భారత క్రికెట్‌ను కుదిపేసిన ఈ వివాదం ప్రస్తుతానికి చల్లబడినట్లే. సర్ఫరాజ్ ఖాన్ అట తీరు చూస్తుంటే.. ఈ వివాదంలో సెలక్టర్లు పైచేయి సాధించినట్లు కనిపిస్తున్నారు. టన్నుల కొద్దీ పరుగుల చేసినా.. అతన్ని ఎంపిక చేయకుండా మానసికంగా కుంగదీసిన సెలెక్టర్లు... మొత్తానికి అతనిని ఫామ్ కోల్పోయేలా చేశారు.

సర్ఫరాజ్ గత మూడేళ్లుగా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో నిలకడైన ఆటతీరుతో మంచి ప్రదర్శన కనపరిచాడు. రంజీ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీల్లో.. ఇలా దేశవాళీ టోర్నీలో అతని సగటు, ది గ్రేట్ సర్ డాన్ బ్రాడ్‌మెన్ ఫస్ట్ క్లాస్ సగటుకి దగ్గరగా ఉండేది. అయినప్పటికీ.. అతడిని సెలక్టర్లు పట్టించుకోలేదు. బరువును సాకుగా చూపుతూ ఫిట్‌నెస్ మెరుగుపచుకోవాలని, మైదానంలో అతని ప్రవర్తన సరిగాలేదని కుంటిసాకులు చెప్పారు.

ఆ మాటలు సర్ఫరాజ్‌ను బాగా కుంగదీసినట్టున్నాయి. ఎన్ని పరుగులు చేసినా తనను పక్కకుపెట్టడం ఖాయమని అతను కూడా ఫిక్సయిపోయాడు. ఈ క్రమంలో ఏకాగ్రత కోల్పోయి.. పరుగులు చేయలేకపోతున్నాడు. దులీప్ ట్రోఫీలో భాగంగా  సెంట్రల్ జోన్‌తో జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచులో తొలి ఇన్నింగ్స్‌లో 12 బంతులు ఆడి డకౌట్ అయిన సర్ఫరాజ్, రెండో ఇన్నింగ్స్‌లో 30 బంతులు ఆడి 6 పరుగులు మాత్రమే చేశాడు. ఇక తాజాగా సౌత్ జోన్‌తో జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్ లో 4 బంతులాడి డకౌట్‌గా వెనుదిరిగాడు.

ఈ పరుగులు చూస్తుంటే సర్ఫరాజ్ మానసికంగా తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నట్టు స్పష్టమవుతోంది. ఈ క్రమంలో సెలెక్టర్లపై క్రికెట్ అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి సెలెక్టర్ల వల్లే దేశానికి రావాల్సిన ట్రోఫీలను మరొకరు తన్నుకెళ్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు. ఇకనైనా ఇలాంటి వారిని సెలక్షన్ కమిటీలోకి తీసుకోకుండా ఉండాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేస్తున్నారు.