
- రాష్ట్ర ప్రభుత్వంపై సర్పంచ్ల ఆగ్రహం
- ఆర్థిక సంఘం నిధులతో యాక్షన్ ప్లాన్
- రూ. 339 కోట్లలో రూ. 203 కోట్లు కేంద్రానివే
హైదరాబాద్, వెలుగు: గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం కేంద్ర ఆర్థిక సంఘం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్లించి మిగతా పథకాలకు వినియోగిస్తోందని పలువురు సర్పంచ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 30 రోజుల పంచాయతీ యాక్షన్ ప్లాన్ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 30 రోజుల పాటు గ్రామాల్లో పారిశుధ్యం, శుభ్రత, విద్యుత్.. ఇతర సమస్యలను పరిష్కరించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ నెల 6 న ప్రారంభమైన ఈ పథకంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టడంలేదు. స్థానిక సమస్యల పరిష్కారానికి ఉద్దేశించిన ఈ పథకానికి సర్కారు కేంద్ర ఆర్థిక సంఘం నిధులను వాడుతోంది. దీనిపై సర్పంచులలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. పంచాయతీల అభివృద్ధికి ఇస్తున్న నిధులను ఇలాంటి కార్యక్రమాలకు ఖర్చు పెట్టడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు.
దేనికి ఉపయోగించాలి?
గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజ్ ల నిర్మాణం(50శాతం), వీధి లైట్లు(10శాతం), పారిశుధ్య కార్యక్రమాలు(15శాతం), తాగునీరు(10 శాతం), ఆపరేషన్స్, మెయింటనెన్స్(10 శాతం), అన్సీన్ ఖర్చుల(5 శాతం)కు ఈ నిధులను ఖర్చుచేయాలి. అయితే, నీతి అయోగ్ సిఫారసు చేసినా మిషన్ కాకతీయ, భగీరథ పథకాలకు కేంద్రం నిధులివ్వడంలేదు. దీంతో పంచాయతీలకు ఇచ్చిన నిధులు సహా ఇతర పథకాలకు వచ్చిన నిధులనూ రాష్ట్ర ప్రభుత్వం వాటికి మళ్లిస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
యాక్షన్ ప్లాన్కు కేంద్ర నిధులా ?
రాష్ట్ర పథకాలపై కేంద్ర పెత్తనమేంటని సీఎం కేసీఆర్ పలుమార్లు ప్రశ్నించారు. మరి కేంద్ర నిధులపై రాష్ట్ర పెత్తనం ఏంటి? యాక్షన్ ప్లాన్ అమలుకు ఆర్థిక సంఘం నిధులెట్ల వాడుతరు? దీనికోసం రాష్ట్ర సర్కారు విడుదల చేసిన రూ.339 కోట్లలో రూ. 203 కోట్లు ఆర్థిక సంఘం నిధులే.. వీటిపై హక్కు పంచాయతీలకే ఉంది. – ప్రణీత్ చందర్, సర్పంచ్, నసురుళ్లబాద్, జడ్చర్ల మండలం.