26న సర్వాయి పాపన్న పోస్టల్ కవర్ విడుదల : బూర నర్సయ్య గౌడ్

26న సర్వాయి పాపన్న పోస్టల్ కవర్ విడుదల : బూర నర్సయ్య గౌడ్

చౌటుప్పల్: బహుజనులకు బీజేపీ న్యాయం చేస్తుందని నమ్మిన, అదే ఈ రోజు నిజం అయ్యిందని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. సర్వాయి పాపన్నకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఇవ్వాలని బీజేపీలో చేరిన వెంటనే అమిత్ షా, నడ్డాలను కోరానని గుర్తు చేస్తూ.. సర్దార్ పాపన్న పోస్టల్ కవర్ ను విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు.

ఈ నెల 26న హైదరాబాద్ లో అధికారికంగా పోస్టల్ కవర్ ను విడుదల చేస్తారని చౌటుప్పల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన తెలిపారు. తన కోరిక మేరకు బీజేపీ పెద్దలు స్పందించి నిర్ణయం తీసుకుంటే.. టీఆర్ఎస్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వాళ్ల వల్లే వచ్చిందని గప్పాలు కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్ ఎస్ నాయకులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సర్వాయి పాపన్న, చాకలి ఐలమ్మ, కృష్ణ స్వామి ముదిరాజ్ లాంటి బహుజన పితామహుల విగ్రహాలను ట్యాంక్ బండ్ పై పెట్టాలని బూర నర్సయ్య గౌడ్ డిమాండ్ చేశారు.

బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు, గుజరాత్ లో లాగా  తెలంగాణ లో కూడా మద్యపాన నిషేధం అమలు చేయాలన్నారు.  ఈనెల 27 న చౌటుప్పల్ లో గౌడ సంఘాల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నామని.. పార్టీలకు అతీతంగా గీత కార్మికులు హాజరుకావాలని కోరారు.