జకర్తా: ఇండియా డబుల్స్ స్టార్ షట్లర్, తెలుగు కుర్రాడు సాత్విక్ సాయిరాజ్, అతని పార్ట్నర్ చిరాగ్ షెట్టి మళ్లీ టాప్ ఫామ్లోకి వచ్చేశారు. గాయాల కారణంగా గత టోర్నీల్లో ఆకట్టుకోలేకపోయిన ఈ యంగ్స్టర్స్ ఇండోనేసియా ఓపెన్ టోర్నమెంట్లో సూపర్ పెర్ఫామెన్స్తో ఫైనల్కు దూసుకెళ్లారు. ఎదురైన ప్రత్యర్థులను చిత్తు చేస్తూ కెరీర్లో తొలిసారి వరల్డ్ టూర్ సూపర్ 1000 టైటిల్కు అడుగు దూరంలో నిలిచారు. మరోవైపు సింగిల్స్లో సీనియర్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్... వరల్డ్ నంబర్ వన్ అక్సెల్సెన్ చేతిలో ఓడి సెమీస్తోనే తన ప్రయాణాన్ని ముగించాడు. దాంతో ఈ టోర్నీలో సాత్విక్–చిరాగ్ మాత్రమే మిగిలారు.
శనివారం జరిగిన మెన్స్ డబుల్స్ సెమీఫైనల్లో ఏడో సీడ్ సాత్విక్-–చిరాగ్ జంట 17–21, 21–19, 21–18తో అన్సీడెడ్ మిన్ హ్యుక్ కాంగ్–సెయుంగ్ జయె సియో (కొరియా)పై మూడు గేమ్స్ పాటు పోరాడి అద్భుత విజయం సాధించారు. దాంతో, ఓ సూపర్ 1000 టోర్నీలో తొలిసారి ఫైనల్ చేరుకున్నారు. మరో సెమీస్లో రెండో సీడ్ ఆరోన్ చియా – వూయి యిక్ సో (మలేసియా) 12–21, 23–21, 21–13తో ప్రముద్య కుసుమవర్దన–యెరేమియా ఎరిచ్ (ఇండోనేసియా) పై నెగ్గారు. ఆదివారం జరిగే ఫైనల్లో సాత్విక్ జంట..చియా–వూయితో అమీతుమీ తేల్చుకోనుంది. మెన్స్ సింగిల్స్ సెమీస్లో ప్రణయ్ 15–21, 15–21తో, విక్టర్ అక్సెల్సెన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయాడు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ పోటీలు ఆరు లెవెల్స్లో జరుగుతాయి. వరల్డ్ టూర్ ఫైనల్స్ చివరి, బెస్ట్ టోర్నీ కాగా సూపర్1000లో ఇండోనేసియా సహా నాలుగు టోర్నీలుంటాయి. ఈ టోర్నీ డబుల్స్ విన్నర్లకు రూ. 75 లక్షల ప్రైజ్మనీ, 12 వేల ర్యాంకింగ్ పాయింట్లు (వరల్డ్ టూర్) లభిస్తాయి.
సవాల్ ఛేదించి..
క్వార్టర్ ఫైనల్లో వరల్డ్ నంబర్ వన్ జోడీకి చెక్ పెట్టిన సాత్విక్, చిరాగ్కు ఈ మ్యాచ్లో అన్సీడెడ్ జోడీ నుంచి సవాల్ ఎదురైంది. తమపై అంచనాలను నిలబెట్టుకున్న ఇండియా యంగ్స్టర్స్ మ్యాచ్ నెగ్గి ముందుకెళ్లారు. 67 నిమిషాల పోరులో తొలి గేమ్ ఆరంభంలోనే కొరియా ప్లేయర్లు మిన్ హ్యుక్–సెయుంగ్ జయె 6–-3తో ఆధిక్యంలోకి వచ్చారు. ఒకసారి వెనుకబడిన తర్వాత సాత్విక్, చిరాగ్ ఫస్టాఫ్లో ప్రత్యర్థులను అందుకునే ప్రయత్నం చేశారు. 15–19, 17–20తో ఆధిక్యం తగ్గించినా అనవసర తప్పిదంతో తొలి గేమ్ కోల్పోయారు. అయితే, కోర్టు మారిన తర్వాత సూపర్గా పుంజుకున్నారు. రెండో గేమ్ స్టార్టింగ్లోనే 6–3తో లీడ్లోకి వచ్చిన ఇండియా షట్లర్లు వేగవంతమైన షాట్లు, బాడీ స్మాష్లు కొడుతూ ఆధిక్యాన్ని 11–4కి పెంచుకున్నారు. అదే సమయంలో కొరియా షట్లర్లు లైన్ను తప్పుగా అంచనా వేయడం, తప్పిదాలు చేయడం సాత్విక్, చిరాగ్కు కలిసొచ్చింది. 15–18తో ప్రత్యర్థులు తమను అందుకునే ప్రయత్నం చేసినా ఎలాంటి అవకాశం ఇవ్వని ఇండియా షట్లర్లు రెండో గేమ్ నెగ్గి మ్యాచ్లో నిలిచారు. ఇక మూడో గేమ్లో తొలి ఐదు పాయింట్ల వరకూ హోరాహోరీ పోరు నడిచింది. అయితే ఒక్కసారిగా స్పీడు పెంచిన సాత్విక్–చిరాగ్ వరుసగా ఏడు పాయింట్లు సొంతం చేసుకొని 12–5తో ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. ఈ దశలో కొరియా షట్లర్లు పుంజుకునే ప్రయత్నం చేశారు. ఓ దశలో 16–16తో స్కోరు సమం చేసి మ్యాచ్లో ఉత్కంఠ రేపారు. కీలక సమయంలో మళ్లీ జోరు పెంచిన సాత్విక్–చిరాగ్ దూకుడుగా ఆడుతూ వరుసగా మూడు పాయింట్లతో 19–16తో ముందంజ వేసి అదే ఊపుతో గేమ్తో పాటు మ్యాచ్ను సొంతం చేసుకున్నారు.