బ్యాంకాక్: ఇండియా డబుల్స్ స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జోడీ.. థాయ్లాండ్ ఓపెన్ సూపర్–500 టోర్నీలో ఫైనల్కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన మెన్స్ డబుల్స్ సెమీస్లో టాప్సీడ్ సాత్విక్–చిరాగ్ 19–21, 22–20, 21–16తో మూడోసీడ్ గో జీ ఫి–నూర్ ఇజ్జుద్దీన్ (మలేసియా)పై గెలిచారు. 82 నిమిషాల మ్యాచ్లో ఇండియన్ ద్వయానికి ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురైంది.
తొలి గేమ్లో ఇరు జంటలు హోరాహోరీగా తలపడటంతో.. మెరుపు వేగంతో ర్యాలీలు, శక్తివంతమైన షాట్లతో కోర్టు హోరెత్తింది. కానీ బ్రేక్ టైమ్లో మలేసియన్లు 11–8 ఆధిక్యంలో నిలిచారు. ఆ తర్వాత చిరాగ్ చేసిన కొన్ని తప్పిదాల వల్ల గో జీ ఫి–నూర్ 18–12, 21–19తో గేమ్ను సొంతం చేసుకున్నారు. రెండో గేమ్లో పుంజుకున్న చిరాగ్–సాత్విక్ 3–3, 6–6తో నిలిచారు. ఈ క్రమంలో ఇండియన్ ద్వయం స్మాష్ల వేగాన్ని మారుస్తూ ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచారు.
బ్రేక్ సమయానికి చిరాగ్–సాత్విక్ ఆధిక్యంలో నిలిచినా.. చివర్లో గట్టిగా పోరాడిన మలేసియన్లు 20–20తో స్కోరును సమం చేశారు. ఈ దశలో రెండు డిఫెన్స్ పాయింట్లతో ఇండియన్ జోడీ గేమ్ గెలిచి మ్యాచ్లో నిలిచింది. డిసైడర్లో సాత్విక్ బలమైన స్మాష్లతో చెలరేగిపోయాడు. 5–5 స్కోరుతో ఉన్న దశలో వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి 11–5 లీడ్లో నిలిపాడు.
అదే టైమ్లో మలేసియా జోడీ వరుస తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. చివర్లో సాత్విక్ క్రాస్ కోర్టు స్మాష్లతో ఈజీగా విజయాన్ని అందించాడు. 2019, 2024లో ఇక్కడ టైటిల్ నెగ్గిన సాత్విక్–చిరాగ్.. ఆదివారం జరిగే ఫైనల్లో లియో రో లీ కర్నాండో–డానియల్ మార్టిన్ (ఇండోనేసియా)తో తలపడతారు.
