
- రియాద్ ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం పలికిన సౌదీ క్రౌన్ప్రిన్స్ బిన్సల్మాన్
- చమురు ధరలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించే చాన్స్
రియాద్: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పశ్చిమాసియా దేశాల పర్యటనకు బయలుదేరి వెళ్లారు. మంగళవారం ఎయిర్ఫోర్స్వన్ విమానాశ్రయంనుంచి బయలుదేరిన ఆయన సౌదీ అరేబియాకు చేరుకున్నారు. రియాద్ ఎయిర్పోర్ట్లో ట్రంప్కు సౌదీ క్రౌన్ప్రిన్స్ మహ్మద్ బిన్సల్మాన్ ఘన స్వాగతం పలికారు. ట్రంప్ వెంట అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, వాణిజ్య మంత్రి హోవర్డ్ లుట్నిక్, ఇంధనశాఖ మంత్రి క్రిస్ రైట్ ఉన్నారు. ట్రంప్ రెండోసారి అమెరికా అధికారపగ్గాలు చేపట్టాక తొలి పెద్ద పర్యటన ఇదే. ఇందులో భాగంగా ఆయన నాలుగు రోజుల్లో సౌదీ, యూఏఈ, ఖతార్ను సందర్శించనున్నారు. ట్రంప్కు క్రౌన్ప్రిన్స్ బిన్సల్మాన్ అధికారిక విందు ఏర్పాటు చేశారు.
ఇందులో అమెజాన్, ఎన్విడియా, ఓపెన్ ఏఐ, ఉబెర్, కోకాకోలా, గూగుల్, బోయింగ్ సీఈవోలు పాల్గొననున్నారు. ఈ విందుకు ప్రపంచ కుబేరుడు, టెస్లా సారథి ఎలాన్ మస్క్ కూడా హాజరుకానున్నారు. అలాగే, రియాద్ నుంచి బయలుదేరే ముందు బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో కూడిన గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్ సభ్యుల సమావేశంలో పాల్గొంటారు. చమురు ధరల తగ్గింపుపై చర్చిస్తారు. ఈ నేపథ్యంలోనే పుతిన్, జెలెన్స్కీతో చర్చలు జరిపి ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి ముగింపు పలికేందుకు ట్రంప్ అడుగులు వేస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగానే తాను తుర్కియేకు వెళ్లే అవకాశం ఉన్నట్లు ట్రంప్ స్వయంగా వెల్లడించారు.
గిఫ్ట్ వద్దనడానికి నేను మూర్ఖుడిని కాదు
ట్రంప్కు ఖతార్ రాజకుటుంబం అత్యంత విలువైన బోయింగ్737 విమానాన్ని గిఫ్ట్గా ఇవ్వాలని నిర్ణయించిందని, దీని విలువ 400 మిలియన్ డాలర్లు ఉంటుందనే ప్రచారం మొదలైంది. దీనిపై అమెరికాలో విమర్శలు మొదలయ్యాయి. ఆ గిఫ్ట్ తీసుకోవడం అనైతికం అంటూ ట్రంప్ సొంత పార్టీలోనే కొందరు ఆందోళన వ్యక్తంచేశారు. అయితే, ఆ విమర్శలను ట్రంప్ తోసిపుచ్చారు. అంత ఖరీదైన గిఫ్ట్ వద్దనడానికి తానేమన్నా మూర్ఖుడినా అని వ్యాఖ్యానించారు. చివర్లో దీనిని ప్రెసిడెన్షియల్ లైబ్రరీకి ఇచ్చేస్తానని, వ్యక్తిగత అవసరాలకు వాడుకునే ఉద్దేశం లేదని తేల్చిచెప్పారు. దీనిని ఎయిర్ఫోర్స్వన్కు వాడుకోనున్నట్టు ట్రంప్ సన్నిహితులు వెల్లడించారు. అయితే, తాము విమానం ఇస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం సరికాదని, తాత్కాలికంగా ఓ విమానాన్ని బదిలీ చేసే అంశం మాత్రమే చర్చల్లో ఉందని ఖతార్ ప్రతినిధి వెల్లడించడం గమనార్హం.