
Amrit Vrishti FD: బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లపై పెట్టుబడిదారులు అధిక వడ్డీ ఆదాయాన్ని పొందే రోజులకు కాలం చెల్లింది. గతవారం భారతీయ రిజర్వు బ్యాంక్ రెపో రేటును తగ్గించటంతో దానికి అనుగుణంగా దేశంలోని ప్రధాన బ్యాంకులు తమ లోన్ వడ్డీ రేట్లతో పాటు డిపాజిట్లపై అందించే వడ్డీ రేట్లను కూడా సవరిస్తున్నాయి. అంటే దీనిప్రకారం గతంలో కంటే తక్కువ వడ్డీని ప్రస్తుతం చేసే టర్మ్ డిపాజిట్లపై ఖాతాదారులు అందుకుంటారని అర్థం.
వివరాల్లోకి వెళితే రిజర్వు బ్యాంక్ నిర్ణయం తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు షాకింగ్ నిర్ణయాన్ని ప్రకటించింది. బ్యాంక్ ప్రత్యేకంగా "అమృత్ వృష్టి" పేరుతో అందిస్తున్న ఫిక్స్డ్ డిపాజిట్లకు వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. కొత్తగా సవరించిన వడ్డీ రేట్లు జూన్ 15, 2025 నుంచి అమలులోకి వస్తాయని వెల్లడించింది. అంటే అధిక వడ్డీ రేట్లు పొందటానికి స్కీమ్ కింద డబ్బు డిపాజిట్లకు ఇవాళే చివరి రోజు. కొందరు దీనిని ఆన్ లైన్ డిపాజిట్ల ద్వారా చివరి రోజున ఉపయోగించుకోవాలని చూస్తున్నారు.
444 రోజుల కాలానికి చేసే "అమృత్ వృష్టి" డిపాజిట్లకు గతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.85 శాతం వడ్డీని ఆఫర్ చేసేది. అయితే దానిని 25 బేసిస్ పాయింట్లు తగ్గించటంతో రేపటి నుంచి ఖాతాదారులు చేసే డిపాజిట్లపై స్కీమ్ కింద 6.6 శాతం వడ్డీని మాత్రమే పొందనున్నారు. అయితే ఇక్కడ సీనియర్, సూపర్ సీనియర్ సిటిజన్లకు అదనపు వడ్డీ రేటు ప్రయోజనం లభిస్తుంది.
ALSO READ | Amazon Now: క్విక్ కామర్స్ వ్యాపారంలోకి అమెజాన్ ఎంట్రీ.. బెంగళూరులో సేవలు లాంచ్..
వడ్డీ రేట్ల సవరింపు తర్వాత సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక పథకం కింద 7.10 శాతం వడ్డీ రేటు లభించనుంది. అలాగే 80 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న సూపర్ సీనియర్ సిటిజన్లకు మాత్రం 10 బేసిస్ పాయింట్లు అదనంగా అంటే 7.20 శాతం వడ్డీ రేటును బ్యాంక్ ఆఫర్ చేస్తోంది. ఈ స్కీమ్ కింద పెట్టుబడిపెట్టిన డబ్బును గడువుకు ముందే ఉపసంహరించుకుంటే రూ.5 లక్షల వరకు 0.50 శాతం జరిమానా, అలాగే 5 లక్షలకు పైన రూ.3 కోట్లకు లోపు రిటైల్ డిపాజిట్లపై 1 శాతం జరిమానాగా వసూలు చేయాలని బ్యాంక్ నిర్ణయించింది.