
బ్యాంకింగ్ రంగంలో టెక్నాలజీ పాత్ర నానాటికీ పెరుగుతుండటంతో , ఉద్యోగుల సంఖ్య తగ్గుతోంది. రాబోయే అయిదేళ్లలో ఉద్యోగుల రిటైర్ మెంట్ తో ఖాళీ అయ్యే ఉద్యోగాలలో 75 శాతం మాత్రమే నింపాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ఇండియా నిర్ణయించుకుంది. ఈ ఉద్యోగులకు నిపుణులైన కేండిడేట్లను ఎంపి క చేసుకోవాలని భావిస్తున్నట్లు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. రైల్వేలో ఉద్యోగాల మాదిరిగానే ఎస్ బీఐలో ఉద్యోగాలంటే యువత ఇష్టపడతున్నారు. రెండేళ్లలో 8 వేల క్లరికల్ ఉద్యోగాలకు 28 లక్షల అప్లికేషన్స్ వచ్చాయంటే , ఎస్ బీఐ పట్ల క్రేజ్ అర్థం చేసుకోవచ్చు.
2018 నుంచి ఏటా ఖాళీ అయ్యే 12 వేల ఉద్యోగాలలో, 10 వేలను మాత్రమే నింపాలని ఎస్ బీఐ నిర్ణయించింది. కొత్తగా క్లర్క్లుగా జాయినవుతున్న ఉద్యోగులలో 80 శాతం ఎంబీఏ చదివిన వారో, ఇంజినీరింగ్ చదివిన వారో వుంటున్నారు. ఇది మాకు చాలా మంచి పరిణామం. క్లరికల్ స్థాయిలో మాకు మంచి నిపుణులు దొరుకుతున్నారు. టెక్నాలజీతోపాటు, ఇతర టూల్స్ పై కూడా వారికి పట్టు వుంటోందని ఎస్ బీఐ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ తెలిపారు.