- వచ్చే ఏడాది ఏప్రిల్లోపు తీసుకోనున్న సంస్థ
న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) దేశవ్యాప్తంగా సేవల మెరుగుపరిచేందుకు సుమారు 3,500 మంది ఆఫీసర్లను నియమించనుంది. ఈ ఏడాది జూన్లో 505 మంది ప్రొబేషనరీ ఆఫీసర్ల (పీఓల) ను ఇప్పటికే నియమించగా, మరో 541 పీఓ ఖాళీలకు ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తులు వచ్చాయి. ప్రిలిమ్స్, మెయిన్స్, సైకోమెట్రిక్ టెస్ట్, ఇంటర్వ్యూల ద్వారా ఈ నియామకాలను చేపట్టనుంది. ఐటీ, సైబర్సెక్యూరిటీ విభాగాల్లో పనిచేయడానికి 1,300 స్పెషలిస్ట్ అధికారులను ఇప్పటికే నియమించామని బ్యాంక్ పేర్కొంది.
అలాగే 3 వేల సర్కిల్ బేస్డ్ అధికారుల నియామక ప్రక్రియ కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తవుతుందని తెలిపింది. ‘‘మొత్తం 18 వేల నియామకాలు జరగనున్నాయి. ఇందులో 13,500 క్లరికల్ పోస్టులు ఉంటాయి. ఎస్బీఐ ప్రస్తుతం 2.4 లక్షలకుపైగా ఉద్యోగులతో దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థగా ఎదిగింది”అని ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టీ అన్నారు. మొత్తం ఉద్యోగుల్లో మహిళా ఉద్యోగుల వాటా 27శాతంగా ఉండగా, రానున్న 5 ఏళ్లలో 30 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
