మా బిల్డింగ్​ మాకియ్యాలె.. ఎస్సీ విమెన్స్​ హాస్టల్​ బిల్డింగ్​లో కొనసాగుతున్న కలెక్టరేట్​ 

మా బిల్డింగ్​ మాకియ్యాలె.. ఎస్సీ విమెన్స్​ హాస్టల్​ బిల్డింగ్​లో కొనసాగుతున్న కలెక్టరేట్​ 

మంచిర్యాల, వెలుగు:  మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎస్సీ విమెన్స్ పోస్ట్​మెట్రిక్ ​హాస్టల్ స్టూడెంట్లు ఆరున్నరేండ్లుగా అవస్థల నడుమ చదువులు సాగిస్తున్నారు. హాస్టల్​కోసం నిర్మించిన బిల్డింగ్​ను గతంలో కలెక్టరేట్​కు కేటాయించి ఆ మహిళా స్టూడెంట్లను పట్టించుకోని అధికారులు.. మరోసారి వారికి అన్యాయం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. హాస్టల్​కోసం డిగ్రీ కాలేజీ గ్రౌండ్​లో అన్ని సౌలతులతో బిల్డింగ్​ నిర్మించినప్పటికీ వారికి అది అందకుండా పోయింది.

ఆరున్నరేండ్లుగా..

2016 అక్టోబర్​లో మంచిర్యాలను ప్రభుత్వం ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయడంతో స్టూడెంట్ల హాస్టల్​కోసం నిర్మించిన ఈ బిల్డింగ్​ను టెంపరరీగా కలెక్టరేట్​కోసం కేటాయించారు. నస్పూర్​లో ఇంటిగ్రేటెడ్​కలెక్టరేట్​ నిర్మాణం ఆలస్యం కావడంతో గత ఆరున్నరేండ్లుగా కలెక్టరేట్​ను ఆ విమెన్స్​ హాస్టల్ ​బిల్డింగ్​లోనే నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు ఇంటిగ్రేటెడ్​కలెక్టరేట్ బిల్డింగ్ సిద్ధమైంది. జూన్​9న సీఎం కేసీఆర్ ​దీన్ని ప్రారంభించారు. కలెక్టర్, ఇద్దరు అడిషనల్​ కలెక్టర్ల పేషీలు, కాన్ఫరెన్స్​ హాల్ నిర్మాణం​పూర్తి కాగా.. మిగతా పనులు కొనసాగుతున్నాయి. రెండు, మూడు నెలల్లో ఈ పనులు కంప్లీట్​కాగానే ఓల్డ్​కలెక్టరేట్​ బిల్డింగ్​లోని ఆఫీసులన్నింటినీ కొత్త బిల్డింగ్​కు షిఫ్ట్​చేయనున్నారు. అయితే, త్వరలోనే ఖాళీ కానున్న ఈ బిల్డింగ్​ను స్టూడెంట్లకు కేటాయిస్తారా? మరి దేనికైనా ఉపయోగిస్తారా? అనేది తెలియాల్సి ఉంది.

సౌలతులు లేక అవస్థలు

ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్​ప్రభుత్వం హయాంలో ఎస్సీ సబ్​ప్లాన్ ​ఫండ్స్​తో ఎస్సీ విమెన్స్​ పోస్ట్​మెట్రిక్​హాస్టల్​ను నిర్మించారు. ఇంటర్, డిగ్రీ విద్యార్థినుల వసతి కోసం దాన్ని తీర్చిదిద్దారు. అయితే, తీరా ఆ బిల్డింగ్​ను కలెక్టరేట్​కు కేటాయించడంతో ఆరున్నర సంవత్సరాలుగా హమాలివాడలోని ఓ రెంట్ ​బిల్డిం
గ్​లో వారిని ఉంచుతున్నారు. అందులో సరిపడా రూములు, సరైన సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థినులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఉంటున్న హాస్టల్ ​నుంచి దాదాపు మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలేజీలకు వెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్నారు. రోజూ అప్ ​అండ్ ​డౌన్ ​ఏడెనిమిది కిలోమీటర్లు నడవలేకపోతున్నామని, మార్గం మధ్యలో పోకిరీల ఈవ్​ టీజింగ్​లు భరించలేకపోతున్నామని విద్యార్థినులు వాపోతున్నారు.

హాస్టల్​కే అప్పగించాలని డిమాండ్

హాస్టల్ బిల్డింగ్​ నుంచి కలెక్టరేట్ ఖాళీ కాగానే తిరిగి హాస్టల్​కే కేటాయించాలని ఆ విద్యార్థినులు కొంతకాలంగా డిమాండ్​ చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు కలెక్టర్​ను కలిసి వినతిపత్రాలు అందజేశారు. అద్దె బిల్డింగ్​లో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. మరోవైపు ఈ బిల్డింగ్​ను జిల్లా కోర్టు కోసం ఆ శాఖ అధికారులు పరిశీలించారు. కోర్టు ఏర్పాటుకు అనుకూలంగా ఉందని, తమకు కేటాయించాలని కలెక్టర్​ను కోరారు. దీంతో మరోసారి హాస్టల్​బిల్డింగ్​తమకు దక్కదేమోనని ఆ స్టూడెంట్లు ఆందోళన చెందుతున్నారు. పక్కనే డిగ్రీ, జూనియర్​కాలేజీలు ఉండడంతో హాస్టల్​ను ఇక్కడికి షిఫ్ట్​ చేస్తే తమ కష్టాలు తొలుగుతాయని విజ్ఞప్తి చేస్తున్నారు. విద్యార్థి సంఘాల నాయకులతో పాటు కాంగ్రెస్ ​పార్టీ లీడర్లు సైతం హాస్టల్ ​బిల్డింగ్​ను హాస్టల్​కే అప్పగించాలని డిమాండ్​ చేస్తున్నారు. ఇటీవల డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్​చక్రపాణి, విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్​ నేతను కలిసి మెమోరాండం అందజేశారు.