తిరుమలలో మరోసారి నకిలీ టికెట్ల బాగోతం వెలుగులోకి వచ్చింది. రూ.300 ప్రత్యేక దర్శనానికి టికెట్ల లేకుండానే అధికారులు అనుమతి ఇచ్చారు. వైకుంఠంలోని సిబ్బంది నకిలీ టికెట్లు సృష్టించి అనుమతి ఇచ్చారు. అనుమానం రావడంతో భక్తులను విజిలెన్స్ అధికారులు విచారించారు. శ్రీలక్ష్మీ శ్రీనివాస మాన్ పవర్ కార్పొరేషన్ సిబ్బందిని టిటిడి విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
దైవ దర్శనం టికెట్ల కోసం, సేవల కోసం వెబ్సైట్లను ఆశ్రయిస్తున్నారా?. అయితే తస్మాత్ జాగ్రత్త. జనాల్లోని భక్తిని క్యాష్ చేసుకునేందుకు నకిలీ వెబ్సైట్లు పుట్టుకొచ్చాయి. ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ ఆలయాలన్నింటిని ఈ నకిలీ వెబ్సైట్ల ముఠా టార్గెట్ చేసింది. తిరుమల కొండకు ఎక్కకుండానే నిలువు దోపిడి చేసేస్తున్నారు ఈ కేటుగాళ్లు. ఆర్జిత సేవల పేరుతో భక్తుల నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటున్నారు.
ప్రముఖ దేవాలయాల ఆర్జిత సేవా టిక్కెట్లు అంటూ ఆన్లైన్లో అమ్మేస్తున్నారు నిర్వాహకులు. ఒక్కొ టికెట్పై వంద నుంచి 2వందలు, 3 వందల శాతం వరకు రేట్లను పెంచేసి అమ్మేస్తున్నారు. ఒక్క టీటీడీ 3 వందలకు అమ్మే దర్శనం టికెట్ను.. వెయ్యి రూపాయలకు అమ్మేస్తున్నారు. దీంతో నకిలీ వెబ్సైట్లపై ఏపీ దేవాదాయ శాఖ దృష్టి పెట్టింది. ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన అధికారులు నిందితులను పట్టుకునే పని చేస్తున్నారు. ఇప్పటికే టీటీడీ అధికారిక వెబ్సైట్ను పోలీ ఉండేలా నకిలీ వెబ్సైట్లు.. క్రియేట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు టీటీడీలో పనిచేస్తున్న ఒప్పంద కార్మికులే నకిలీ టికెట్లను సృష్టించి భక్తులను అనుమతించారు. అనుమానం రావడంతో భక్తులను విచారించిన విజిలెన్స్ అధికారులున శ్రీలక్ష్మి శ్రీనివాస మాన్ పవర్ కార్పొరేషన్ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు.