ఐపీఎల్ ను అడ్డంపెట్టుకుని కొందరు కేటుగాళ్లు కోట్లు సంపాదిస్తున్నారు. ప్రిడిక్షన్ పేరుతో సామాన్యులను బురిడీ కొట్టిస్తున్నారు. టాస్ ఎవరు గెలుస్తారు? మ్యాచ్ ఎవరి పక్షాన ఉంటుంది? ఇవన్నీ మాకు ముందే తెలుసంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. తమ దగ్గర సబ్ స్క్రిప్షన్ తీసుకుంటే బెట్టింగ్లో లక్షలు సంపాదించొచ్చని బురిడీ కొట్టిస్తున్నారు. వాట్సప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వేదికగా తప్పుడు ప్రచారాలు చేస్తూ అమాయకులను అట్రాక్ట్ చేస్తున్నారు కేటుగాళ్లు.
మా సబ్స్క్రైబర్లు రోజుకు లక్షలు గడిస్తున్నారు.. మాకు ఐపీఎల్ నిర్వాహకుల నుంచే సమాచారం అందుతుందంటూ పచ్చి అబద్ధాలతో కేటుగాళ్లు పబ్లిక్ ను బుట్టలో వేసుకుంటున్నారు. వాస్తవానికి వీరికి నిర్వాహకులకు ఎలాంటి సంబంధం ఉండదు. అది కేవలం మీ డబ్బు దోచుకోవడానికి వారు వేసిన మాస్టర్ ప్లాన్ మాత్రమేనని గమనించాలి.
బెట్టింగ్ జూదమని ఇలాంటి ప్రిడిక్షన్ మాటలు నమ్మి కష్టపడి సంపాదించిన సొమ్మును పోగొట్టుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులకు డబ్బులు పంపి మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

