లండన్ : మసాజ్ సెంటర్ లో ఉద్యోగాలు ఇస్తానని ఓ యాప్ లో ప్రకటనలు ఇచ్చి మహిళలపై అత్యాచారం చేసిన తెలుగు వ్యక్తికి యూకేలో కోర్టు 18 ఏండ్ల జైలుశిక్ష విధించింది. ఈ మేరకు వుడ్ గ్రీన్ క్రౌన్ కోర్టు తీర్పు ఇచ్చింది. రఘు సింగమనేని (50) నార్త్ లండన్ లో రెండు మసాజ్ పార్లర్లు నడిపేవాడు. తన పార్లర్ లో మహిళలకు పని ఇస్తానని ఓ జాబ్స్ యాప్ లో ప్రకటనలు ఇచ్చేవాడు. ఆ మహిళలను కలిసేందుకు ఏర్పాట్లు చేసుకొని వారికి మత్తు పానీయాలు ఇచ్చి అత్యాచారం చేసేవాడు. ఇలా పలువురు మహిళలపై అతను అదేపనిగా అకృత్యాలకు పాల్పడేవాడు.
17 ఏండ్ల బాధితురాలు రఘుపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. అతన్ని విచారించగా నేరాలు చేసినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు చెప్పారు. దీంతో వుడ్ గ్రీన్ కోర్టు అతనికి 18 ఏండ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చిందని వెల్లడించారు.