- టెట్ రాసేందుకు ‘వన్ టైమ్’ పర్మిషన్ ఇవ్వాలని విజ్ఞప్తి
- ప్రభుత్వానికి లేఖ రాసిన పాఠశాల విద్యా శాఖ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టెట్ పరీక్షకు హాజరవుతున్న ఇన్ -సర్వీస్ టీచర్లకు ఎగ్జామ్ రోజు ‘ఆన్ డ్యూటీ’ (ఓడీ) సౌకర్యం కల్పించాలని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు భావిస్తున్నారు. తాజాగా సర్కారు అనుమతి కోసం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ నెల 3 నుంచి 20 వరకు కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో టెట్ పరీక్షలు జరుగుతున్నాయి. కాగా.. సర్కారు, లోకల్ బాడీ, కేజీబీవీ, మోడల్ స్కూల్స్, ఇతర ప్రభుత్వ సంక్షేమ స్కూళ్లలో పనిచేస్తున్న సుమారు 71,670 మంది ఇన్- సర్వీస్ టీచర్లు ఈసారి టెట్ రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో భారీగా అప్లై చేశారు. అయితే, పరీక్ష ఉన్న రోజు తమకు సెలవు లేదా ఓడీ ఇవ్వాలని టీచర్ల సంఘాలు, టీచర్ ఎమ్మెల్సీల నుంచి విద్యా శాఖకు విజ్ఞప్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో డైరెక్టర్ నవీన్ నికోలస్ స్పందిస్తూ.. డిపార్ట్మెంటల్ టెస్టులకు హాజరయ్యే ఉద్యోగులకు రెండుసార్లు ఓడీ ఇచ్చే నిబంధన ఉన్నందున, ఇప్పుడు టెట్ రాస్తున్న టీచర్లకు కూడా అదే పద్ధతిలో అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఓడీ సౌకర్యాన్ని ‘వన్ టైమ్’ మాత్రమే కల్పించాలని ప్రపోజల్స్లో పేర్కొన్నారు.
