చెత్త కుప్పలో స్కూల్​ యూనిఫామ్స్!

చెత్త కుప్పలో స్కూల్​ యూనిఫామ్స్!
  • హనుమకొండ ఎమ్మార్పీ బిల్డింగ్​ వెనక పడేసిన సిబ్బంది 
  • సోషల్​ మీడియాలో వైరల్​
  • మళ్లీ ఆఫీసులో పెట్టించామన్న ఎంఈఓ

హనుమకొండ, వెలుగు: సర్కారు బడుల్లోని విద్యార్థుల కోసం ప్రభుత్వం పంపిణీ చేసిన యూనిఫామ్స్​ చెత్తకుప్పలోకి చేరాయి. స్డూడెంట్స్​కు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం  యూనిఫామ్స్ కుట్టించి హనుమకొండలోని ఎమ్మార్సీ సెంటర్​కు పంపించింది. ఇప్పటికే స్కూళ్లకు పంపిణీ చేయగా..ఇంకొన్ని యూనిఫామ్స్​, క్లాత్​ ఎమ్మార్సీ సెంటర్లలోనే మిగిలిపోయాయి. ఇదిలాఉంటే మిగిలిన స్టాక్  ఎందుకనుకున్నారో , వాటితో పని లేదనుకున్నారో ఏమో గానీ, అక్కడి సిబ్బంది యూనిఫామ్స్​ కట్టలను ఎమ్మార్సీ బిల్డింగ్​ గోడ వెనుక పడేశారు. ఒక పెద్ద బ్యాగ్​లో పెట్టి వాటిని చెత్తకుప్పలో వదిలేశారు. దీంతో అటుగా వెళ్తున్న కొంతమంది యువకులు ఫొటోలు, వీడియోలు తీసి గురువారం సోషల్ మీడియాలో పోస్ట్​ చేయగా.. వైరల్​గా మారాయి.

ఇప్పటికే చాలాచోట్ల యూనిఫామ్స్​సరిపోక, కొన్నిచోట్ల కొలతలు సరిగ్గా లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతుండగా.. విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన యూనిఫామ్స్​ ను చెత్తకుప్పలో పడేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై హనుమకొండ ఎంఈఓ ఈ.రామ్​కిషన్​రాజును వివరణ కోరగా.. ఆఫీస్​లో పని చేసే సిబ్బంది తమకు తెలియకుండా యూనిఫామ్స్​బయటపడేసిన విషయం వాస్తవమేనన్నారు. విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే యూనిఫామ్స్​మళ్లీ ఆఫీస్​గదిలోకి మార్పించినట్లు తెలిపారు. ఈ విషయంలో సిబ్బందిని కూడా హెచ్చరించినట్లు వివరించారు.