
- ఆదేశించిన సెబీ
న్యూఢిల్లీ: గీతాంజలి జెమ్స్షేర్ల ఇన్సైడర్ ట్రేడింగ్కేసులో వజ్రాలవ్యాపారి మెహుల్ చోక్సీ నుంచి రూ.2.1 కోట్లు రాబట్టడానికి సెబీ అతడి బ్యాంక్ ఖాతాలు, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ హోల్డింగ్స్ను అటాచ్ చేయాలని ఆదేశించింది. గత నెల15న చోక్సీకి జారీ చేసిన డిమాండ్ నోటీసు తర్వాత ఈ చర్య తీసుకుంది. 15 రోజుల్లోపు డబ్బు కట్టకుంటే ఆస్తులతో పాటు బ్యాంకు ఖాతాలను కూడా అటాచ్ చేస్తామని హెచ్చరించింది.
గీతాంజలి జెమ్స్ లిమిటెడ్ షేర్లలో ఇన్సైడర్ ట్రేడింగ్ నిబంధనలను ఉల్లంఘించిన కేసులో 2022 జనవరిలో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) విధించిన జరిమానాను చోక్సీ చెల్లించకపోవడంతో ఈ డిమాండ్ నోటీసు వచ్చింది. గీతాంజలి జెమ్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా ప్రమోటర్ గ్రూప్లో భాగమైన చోక్సీ, నీరవ్ మోడీకి మామ.
ప్రభుత్వ యాజమాన్యంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)ను రూ.14 వేల కోట్లకు పైగా మోసం చేసినట్లు ఇద్దరూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2018 ప్రారంభంలో పీఎన్బీ స్కామ్ వెలుగులోకి వచ్చిన తర్వాత వీళ్లు భారతదేశం నుంచి పారిపోయారు. ఈ ఏడాది ఏప్రిల్లో, భారత దర్యాప్తు సంస్థల అప్పగింత అభ్యర్థన మేరకు చోక్సీని బెల్జియంలో అరెస్టు చేశారు.
గత సంవత్సరం వైద్య చికిత్స కోసం అక్కడికి వెళ్లినప్పుడు ఆయన బెల్జియంలో ఉన్నారు. భారతదేశం నుంచి బయలుదేరిన తర్వాత , 2018 నుంచి ఆంటిగ్వాలో ఉంటున్నాడు. మోడీని స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు మార్చి 2019లో అరెస్టు చేశారు.
ప్రస్తుతం ఆ దేశ జైలులో ఉన్నారు. ఈ నెల నాలుగున సెబీ అటాచ్మెంట్ నోటీసు ఇచ్చింది. పెండింగ్లో ఉన్న రూ. 2.1 కోట్ల బకాయిలలో రూ. 1.5 కోట్ల జరిమానా, రూ. 60 లక్షల వడ్డీ ఉన్నాయని తెలిపింది.