- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బాదావత్ సంతోష్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : జిల్లాలోని నాగర్కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ మున్సిపాలిటీలకు జరుగుతున్న ఎన్నికల్లో విధులు నిర్వహించే సిబ్బందికి రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేశామని కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో ఎన్నికల పరిశీలకురాలు రాజ్యలక్ష్మి, అడిషనల్ కలెక్టర్లు అమరేందర్, దేవ సహాయంతో కలిసి ఎన్నికల సిబ్బందికి ర్యాండమైజేషన్ ను నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని నాగర్కర్నూల్ మున్సిపాలిటీలో 49, కల్వకుర్తిలో 44, కొల్లాపూర్ లో 38 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి మున్సిపాలిటీకి అదనంగా 20 శాతం సిబ్బందిని కేటాయించినట్లు చెప్పారు. 131 పోలింగ్ కేంద్రాలకు గానూ, 159 మంది ప్రిసైడింగ్ అధికారులు, 159 మంది సహాయ ప్రిసైడింగ్ అధికారులు, 474 మంది ఇతర పోలింగ్ అధికారులను కేటాయించామని తెలిపారు.
ఈనెల 11న జరగనున్న పోలింగ్ సందర్భంగా 131 పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల ఏర్పాటు చేయడంతో పాటు పోలింగ్ జరిగే రోజున వెబ్కాస్టింగ్ చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. అంతకుముందు నాగర్ కర్నూల్ మున్సిపాలిటీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో నోడల్ అధికారులు డీఈవో రమేశ్కుమార్, సీతారాం నాయక్ పాల్గొన్నారు.
దేవరకద్రలో కలెక్టర్ విజయేందిరబోయి
చిన్నచింతకుంట : మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కలెక్టర్ విజయేందిరబోయి మంగళవారం దేవరకద్ర మున్సిపాలిటీని సందర్శించారు. ప్రత్యేక సాప్ట్ వేర్ ద్వారా రెండవ ర్యాండమైజేషన్ నిర్వహించి పోలింగ్ బృందాలను మున్సిపాలిటీలకు కేటాయించారు. పోలింగ్ టీమ్ పీఓ, ఏపీఓ, ఓపీఓలను మండలాల్లో పని చేస్తున్న వారిని మున్సిపాలిటీలకు కేటాయించారు.
