- సెకెండ్ ఫేజ్లోనూ.. భారీ పోలింగ్ 91.72 శాతం నమోదు
- అత్యధికంగా భూదాన్ పోచంపల్లిలో 93.11
- రామన్నపేటలో 90.58
యాదాద్రి, వెలుగు: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో మహిళలు భారీ ఎత్తున ఓట్లు వేశారు. మెజారిటీ పంచాయతీల్లో పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొన్నారు. పోటీ చేసిన అభ్యర్థుల గెలుపులో మహిళలే నిర్ణేతలుగా వ్యవహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు వేయడానికి పెద్ద ఎత్తున మహిళా ఓటర్లు తరలివచ్చారు.
జిల్లాలోని హెచ్ఎండీఏ మండలాలైన భువనగిరి, బీబీనగర్. భూదాన్ పోచంపల్లి సహా వలిగొండ, రామన్నపేట మండలాల్లో ఆదివారం ఎన్నికలు జరిగాయి. ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను రప్పించడంలో పోటీ చేసిన అభ్యర్థులు సక్సెస్ అయ్యారు. దీంతో చాలా మంది ఓటర్లు శనివారం రాత్రే రాగా మరికొందరు ఆదివారం ఉదయం వచ్చి ఓటు వేయడానికి ఉదయం ఏడు నుంచే బారులు తీరారు. వృద్ధులు కూడా ఉదయమే పోలింగ్ సెంటర్లకు వచ్చి ఓట్లు వేశారు.
సెకండ్ ఫేజ్లో 91.72 శాతం
సెకండ్ ఫేజ్లో 150 పంచాయతీలు, 1332 వార్డుల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. 2,07,816 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. అయితే ఐదు పంచాయతీల్లో సర్పంచ్ సహా పాలకవర్గం, మరో ఐదు పంచాయతీల్లో సర్పంచ్లు ఏకగ్రీమయ్యారు. దీంతో ఆదివారం 140 పంచాయతీల్లో 378 మంది సర్పంచ్ అభ్యర్థులు, 1161 వార్డుల్లో 2581 మంది పోటీపడ్డారు.
ఏకగ్రీమైన పంచాయతీలు, వార్డుల్లో ఎన్నికలు జరగనందున ఓటర్ల సంఖ్య 5100 తగ్గి 2,02,716కు చేరింది. ఉదయం తొమ్మది గంటల వరకే 20.92 శాతం పోలింగ్ నమోదైంది. 11 గంటలకు 57.12 శాతం, పోలింగ్ సమయం ముగిసే సమయానికి మధ్యాహ్నం ఒంటిగంటకు 82.53 శాతం నమోదైంది. ఆ తర్వాత గేటులోపుల ఉన్న వాళ్లు ఓట్లు వేశారు. మొత్తంగా 1,85,937 (91.72శాతం) మంది ఓటేశారు.
ఓటెత్తిన మహిళలు
ఫస్ట్ ఫేజ్ తరహాలోనే సెకండ్ ఫేజ్ ఎన్నికల్లోనూ మహిళలే నిర్ణేతలుగా నిలిచారు. ఈ దశలో పురుషుల ఓట్లు 1,00,801 ఉండగా 92,562 (91.83 శాతం) ఓటేశారు. మహిళల ఓట్లు 1,01,915 ఓట్లు ఉండగా 93,375 (91.62 శాతం) ఓటు వేశారు. అయితే పోలింగ్ పర్సెంటేజీలో మహిళల ఓట్లు తగ్గినా, ఓట్ల సంఖ్యలో మాత్రం పురుషుల కంటే ఎక్కువగా వేశారు. కొన్ని పంచాయతీల్లో తప్ప మిగిలిన వాటిలో మహిళల ఓట్లే ఎక్కువగా పోలింగ్ కావడంలో అభ్యర్థుల గెలుపులో నిర్ణేతలుగా నిలిచారు.
పోచంపల్లిలో ఎక్కువ.. రామన్నపేటలో తక్కువ
సెకండ్ ఫేజ్లో ఐదు మండలాల్లో ఎన్నికలు జరగగా భూదాన్ పోచంపల్లిలో పోలింగ్ ఎక్కువగా నమోదైంది. పోచంపల్లిలో 20 పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి. వీటిలో 26,921 ఓటర్లు ఉండగా 25,066 (93.11 శాతం) ఓటేశారు.
భువనగిరి మండలంలో 31 పంచాయతీల్లో 38,306 ఓట్లు ఉండగా 32,751 (93.08 శాతం) ఓట్లు పోలయ్యాయి. బీబీనగర్ మండలంలో 30 పంచాయతీల్లో 41,154 ఓట్లు ఉండగా 37,605 (91.38 శాతం) పోలయ్యాయి. వలిగొండ మండలంలో 37 పంచాయతీల్లో 52,431 ఓట్లు ఉండగా 47,840 ఓట్లు పోలయ్యాయి. రామన్నపేట మండలంలో 22 పంచాయతీల్లో 43,904 ఓట్లుఉండగా 39,769 (90.58 శాతం) పోలయ్యాయి.
