ఘనంగా ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డుల ప్రదానం
హైదరాబాద్, వెలుగు : సోలార్ పవర్ ప్రొడక్షన్లో తెలంగాణ..దేశంలోనే రెండో స్థానంలో ఉన్నదని, హరితహారంతో ఇంధన వనరులను కాపాడానికి కృషి చేస్తోందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోనే 4.50లక్షల ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేయడమే దీనికి ఉదాహరణ అని అన్నారు. శుక్రవారం ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్ లో టీఎస్ రెడ్కో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇంధన పొదుపు అవార్డుల కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇండియా తీసుకుంటున్న ఇన్షియేటివ్తో సోలార్ ఎలయెన్స్లో ఇప్పటికే 80 దేశాలు చేరాయని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా తొలగించిన చెట్ల స్థానంలో మరోచోట కోట్లాది మొక్కలు నాటడం ఎనర్జీ కన్సర్వేషన్ చేస్తున్న గొప్ప విషయమన్నారు.
విద్యుత్శాఖామంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడే నాటికి సాంప్రదాయేతర ఇంధనాలు 70 మెగావాట్లు మాత్రమే ఉండేదని, ఇప్పుడు 3700 మెగావాట్ల సోలార్ పవర్ సాధించామన్నారు. ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్రావు మాట్లాడుతూ రాష్ట్రంలో కరెంట్ప్రొడక్షన్, సరఫరాతో పాటు తలసరి విద్యుత్ వినియోగం పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, టీఎస్ రెడ్ కో చైర్మన్ అబ్దుల్ అలీం, టీఎస్ రెడ్ కో వైస్ చైర్మన్జానయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంధన వినియోగాన్ని తగ్గించిన సంస్థలకు గవర్నర్ పురస్కారాలు అందజేశారు. 8 కేటగిరీల్లో ప్రకటించగా దక్షిణ మధ్య రైల్వే మూడు అవార్డులు సొంతం చేసుకుంది.