పాకిస్థాన్ గూఢచారిగా అనుమానిస్తున్న సీమా హైదర్ కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాక్ మహిళ సీమా హైదర్, ఉత్తరప్రదేశ్ కు చెందిన ఆమె లవర్ సచిన్ మీనా లవ్ స్టోరీపై యూపీ పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో పోలీసులు కీలక విషయాలను గుర్తించారు.
ఖాఠ్మండులో 204 గదిలో బస...
పాకిస్థాన్కు చెందిన 30 ఏళ్ల సీమా హైదర్, గ్రేటర్ నోయిడాలోని రబుపురా ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల సచిన్ మీనాకు 2019లో ఆన్లైన్ గేమ్ పబ్జీ ద్వారా పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారడంతో..వీరిద్దరు ఈ ఏడాది మే నెలలో నేపాల్లో కలుసుకున్నారు. ఖాట్మండు లోని ఓ హోటల్లో రూమ్ నంబర్ 204 కొన్ని రోజుల పాటు బస చేశారని పోలీసులు తెలిపారు. నేపాల్ లోని ఖాఠ్మండులో కలుసుకుందామని సీమా హైదర్ ..సచిన్ కు సమాచారం ఇవ్వడంతో... ఖాట్మండుకు ముందుగా చేరుకున్న సచిన్..అక్కడ న్యూ వినాయక్ హోటల్లో రూమ్ నంబర్ 204ను బుక్ చేశాడు. అంతేకాదు.. తన భార్య కూడా వస్తున్నట్లు హోటల్ సిబ్బందికి చెప్పాడు. రిజిస్టర్లో తప్పుడు పేర్లు రాశాడని..అందుకు సంబంధించి ఎలాంటి ఐడీ కార్డులు చూపించలేదని పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు.
భారత్లో ఎంటర్ అయ్యేందుకు పెద్ద స్కెచ్
సీమా హైదర్ భారత్ లోకి రావడానికి పెద్ద ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఆమె భారత్లోకి రావడానికి మేకప్పై దృష్టిపెట్టిందని ఇంటలీజెన్స్ వర్గాలు వెల్లడించాయి. అచ్చం భారతీయ మహిళ మాదిరిగా కనిపించేలా మేకప్ కోసం ప్రొఫెషనల్స్ సాయం తీసుకుందట. తన పిల్లల విషయంలో కూడా ఇదే జాగ్రత్తలు పాటించదని సమాచారం. వేషధారణే కాదు.. భాషనైపుణ్యాలు కూడా బాగానే అవపోసన పట్టిందట. భారతీయ యాసలో అనర్గళంగా మాట్లాడుతోంది. నేపాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్న పాకిస్తానీ నిర్వహకులు ఆమెకు శిక్షణ ఇచ్చి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఖాఠ్మండు నుంచి నోయిడాకు..
ఖాఠ్మండు హోటల్ లోని 204 నెంబర్ గల రూమ్లో కొన్ని రోజులు గడిపిన సీమా హైదర్..సచిన్ మీనాలు..ఆ. హోటల్ రిసెప్షనిస్ట్ గణేష్ రోకంగర్ పిల్లలతో కలిసి సెల్ఫీలు, రీల్స్ చేశారట. ఈ ఫోటోలు, వీడియోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. సచిన్తో కలిసి నేపాల్లో షికార్లకు వెళ్లిన ఆమె...వారం రోజుల తర్వాత వారిద్దరూ క్యాబ్లో పోఖరా ప్రాంతానికి వెళ్లారు. అక్కడి నుంచి సీమా అక్రమ మార్గంలో ఉత్తరప్రదేశ్లోని నోయిడాకు చేరుకుందని పోలీసులు తెలిపారు.
పాక్ సైన్యంలో హైదర్ కుటుంబీకులు..
సీమా హైదర్ కుటుంబీకులు పాకిస్థాన్ ఆర్మీలో పని చేస్తున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని సీమా భర్త గులామ్ హైదర్ ఓ భారతీయ వార్తా సంస్థకు వెల్లడించాడు. సీమా హైదర్ సోదరుడు ఆసిఫ్ పాకిస్థాన్ సైన్యంలో చేరాడట. అంతేకాకుండా ఆమె బంధువు పాక్ సైన్యంలో ఉన్నతస్థాయి అధికారిగా ఉన్నట్లు గులామ్ తెలిపాడు. దీంతో సీమా హైదర్ పాకిస్తాన్ గూఢచారి అన్న అనుమానాలకు మరింత బలం చేకూరింది. మరోవైపు సీమాకు ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో విచారిస్తున్నారు.
జులై 4వ తేదీన సీమా హైదర్, సచిన్ మీనా తమ లవ్ స్టోరీ గురించి వెల్లడించారు. ఈ నేపథ్యంలో సీమా హైదర్ ఎలాంటి వీసా, పత్రాలు లేకుండా భారత్లోకి అక్రమంగా ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించి వారిని అరెస్ట్ చేశారు. ఈ నెల 7న ఆ జంటకు స్థానిక కోర్టు బెయిల్ ఇచ్చింది. ప్రస్తుతం సీమా హైదర్తోపాటు ఆమె లవర్ సచిన్ మీనా, అతడి తండ్రి ప్రస్తుతం యూపీ ఏటీఎస్ అధికారులు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీల అదుపులో ఉన్నారు. వీరిని ప్రాంతానికి తరలించి ప్రశ్నిస్తున్నారు. సీమా చాలా ఆలస్యంగా 2022 సెప్టెంబర్ 20న తీసుకున్న పాకిస్థాన్ పౌర పత్రం, ఆమె పాస్పోర్ట్, ఆధార్కార్డు, నలుగురు పిల్లలకు సంబంధించిన ఇతర పత్రాలను కూడా పరిశీలిస్తున్నారు. అలాగే వారిద్దరూ కలిసి ఖాట్మండు హోటల్లోని రూమ్ నంబర్ 204లో బస చేయడంపై కూడా దర్యాప్తు చేస్తున్నారు.
