
బంగారు రాజదండం సెంగోల్ ను ప్రధాని మోదీ అందుకున్నారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి ఒకరోజు ముందు ప్రధాని నరేంద్ర మోదీ మే 27వ తేదీ శనివారం ఢిల్లీలోని తన నివాసంలో తమిళనాడు కు చెందిన 20 శైవ పీఠాల అధిపతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మఠాధిపతుల్లో 293వ ప్రధాన పూజారి ప్రధాని మోదీకి సెంగోల్ను బహుకరించారు. తిరువావడుతురైకి చెందిన 20 శైవ మఠాధిపతులు చెన్నై నుంచి మే 27వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధాని మోదీని ఆయన నివాసంలో కలిసి ఘనంగా సత్కరించారు. అనంతరం మోదీకి సెంగోల్ ను బహూకరించారు.
కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ స్పీకర్ సీటు దగ్గర 'సెంగోల్' (రాజదండం) ఉంచుతారు.14 ఆగస్టు, 1947న, పండిట్ జవహర్లాల్ నెహ్రూ మొదటిసారిగా ఈ సెంగోల్ను అందుకున్నారు. ఇది బ్రిటీష్ వారి చేతుల నుండి అధికార మార్పిడికి చిహ్నంగా అభివర్ణించారు. అప్పటి మద్రాసులో సుప్రసిద్ధ నగల వ్యాపారి అయిన వుమ్మిడి బంగారు చెట్టి ఈ సెంగోల్ను రూపొందించారు. అద్భుతమైన రాజదండం సుమారు ఐదు అడుగుల పొడవు, పైభాగంలో ఒక ఎద్దు చెక్కబడి ఉంటుంది.