
హైదరాబాద్, వెలుగు: సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకుడు సీహెచ్ ఎంవీ కృష్ణారావు (64) గురువారం హైదరాబాద్లో కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన గోపనపల్లి జర్నలిస్ట్ కాలనీలోని తన ఇంట్లో కన్నుమూశారు. ఆయనకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. రాజకీయ నాయకులంతా బాబాయ్గా పిలుచుకునే కృష్ణారావు జర్నలిజం ప్రస్థానం ఈనాడుతో మొదలైంది. తర్వాత ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, డెక్కన్ క్రానికల్, ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్లో పలు హోదాల్లో పనిచేశారు.
సుదీర్ఘకాలం జర్నలిస్ట్గా పని చేసిన కృష్ణారావు.. పలు సంచలనాత్మక కథనాలు రాశారు. శుక్రవారం జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. గోపనపల్లిలోని కృష్ణారావు నివాసానికి వెళ్లి మంత్రి హరీశ్ రావు నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మీడియా రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. కృష్ణారావు మృతి బాధాకరమని, మీడియా రంగంలో ఆయన లేని లోటు తీర్చలేనిదని పేర్కొన్నారు.
జర్నలిజంలో తనదైన ముద్ర: తమిళిసై, దత్తాత్రేయ
‘‘కృష్ణారావు మృతి చాలా బాధాకరం. రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు, ఇంగ్లిష్ జర్నలిజంపై ఆయన తనదైన ముద్ర వేశారు. ఆయన మృతి మీడియా రంగానికి తీరని లోటు. జర్నలిజం రంగానికి ఎంతో సేవ చేశారు. ఆయన మరణం పత్రికా రంగానికి తీరని లోటు” అని పేర్కొన్నారు.
పత్రికా రంగానికి తీరని లోటు: సీఎం కేసీఆర్
‘‘కృష్ణారావు మరణం పత్రికా రంగానికి తీరని లోటు. అభ్యుదయ భావాలు కలిగిన కృష్ణారావు జర్నలిస్టుగా చేసిన సేవలు చిరస్మరణీయం. ఆయన చేసిన రచనలు, విశ్లేషణలు, కొనసాగించిన టీవీ చర్చలు ఆలోచన రేకెత్తించేవిగా ఉండేవి. 4 దశాబ్దాలకుపైగా జర్నలిజం రంగానికి నిజాయితీగా సేవలందించారు. ఆయన మృతికి నా సంతాపం. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి” అని అన్నారు.
కృష్ణారావు మృతి చాలా బాధాకరమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. వృత్తి పట్ల ఎంతో అంకిత భావం ఉన్న వ్యక్తి అని పేర్కొన్నారు. పాత్రికేయ విలువలకు పట్టంగట్టారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. కృష్ణారావు మరణం అత్యంత బాధాకరమని, పత్రిక రంగానికి తీరని లోటని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. రాజకీయ విశ్లేషణల్లో తనదైన ముద్ర వేశారని ఎంపీ బండి సంజయ్ పేర్కొన్నారు.
పెద్ద బాబాయ్గా అందరికి సుపరిచితులైన కృష్ణారావు గత 4 దశాబ్దాలుగా జర్నలిజం రంగానికి ఎనలేని సేవ చేశారన్నారు. కృష్ణారావు నిఖార్సైన జర్నలిస్టు అని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. రాజకీయ విశ్లేషణల్లో కృష్ణారావుది ప్రత్యేక ముద్ర అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. ఆయన అకాల మరణం పాత్రికేయ లోకానికి తీరని లోటన్నారు. కృష్ణారావు మరణం రెండు తెలుగు రాష్ట్రాల జర్నలిస్టులకు తీరని లోటని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పేర్కొన్నారు.